
అప్పులు ఆరగించిందెవరు?
ఎఫెక్ట్
పాపన్నపేట(మెదక్): ‘సంఘాల రుణాల స్వాహా’ పేరిట శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. డీఎంజీ సీబీఓ ఆడిటర్ నాగరాజు, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ రజిత పాపన్నపేటకు చేరుకొని ఏపీఎం సాయిలుతో కలిసి పొడిచన్పల్లి యూకో బ్యాంకు నుంచి స్టేట్మెంట్లు సేకరించారు. ఈమేరకు లావాదేవిలపై క్షుణ్ణంగా పరిశీలన జరుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్ జోనల్ ఆఫీస్ నుంచి బ్యాంకు అధికారులు శనివారం విచారణ నిమిత్తం పొడిచన్పల్లి రానున్నట్లు మేనేజర్ అజహరుద్దీన్ తెలిపారు. పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు.
రెండేళ్లలో రూ. 14.86 లక్షలు మళ్లింపు
స్వయం సహాయక సంఘాల అకౌంట్ నుంచి నేరుగా వీఓఏ వ్యక్తిగత అకౌంట్లోకి రెండేళ్లలో రూ. 14.86 లక్షల బ్యాంకు రుణాలు మళ్లినట్లు తెలుస్తుంది. ఆగస్టు 14, 2023న గంగపుత్ర స్వయం సహాయక గ్రూపు నుంచి రూ. 6,69,000 వీఓఏ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించినట్లు సమాచారం. అలాగే మే 4, 2023 నాడు విజయ గ్రూపు నుంచి రూ. 1,42,000, 10 ఏప్రిల్ 2024 నాడు పోచమ్మ గ్రూపు నుంచి రూ. 6,75,000 మళ్లించినట్లు తెలుస్తుంది. ఇంకా ఏమైనా నిధులు నేరుగా మళ్లించారా? అనే విషయమై అధికారులు అన్ని స్వయం సహాయక గ్రూపుల ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఇవి గాక గ్రూపుల పేరిట తీసుకున్న బ్యాంకు రుణాలను సభ్యులకు ఇవ్వకుండా నేరుగా డ్రా చేసుకున్నారా, ఇతర సీ్త్రనిధి, గ్రామ సంఘం నిధులు ఏవైనా మళ్లించారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం యూకో బ్యాంకులో నాలుగైదు గ్రూపులు తమ రుణాలను సమయానుకూలంగా చెల్లించడం లేదని తెలుస్తుంది. ఇంతకు ఈ రుణాలు నిజమైన సభ్యులు తీసుకున్నారా? లేక వారికి తెలియకుండా ఎవరైనా మధ్యవర్తులు కాజేశారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అధికారులపై అనుమానాలు
మహిళా సంఘాల రుణాల స్వాహాపై ప్రారంభమైన విచారణ
యూకో బ్యాంకు నుంచి స్టేట్మెంట్ల సేకరణ
పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారుల ఆరా
అందరు కలిసి ముంచారు
ఈ రుణాల స్వాహా వ్యవహారంలో అందరు కలిసి నన్ను ముంచేశారు. బ్యాంకు నుంచి వచ్చిన డబ్బులను బ్యాంకు అధికారులు, మహిళా సమైఖ్య మండల, గ్రామస్థాయి అధికారులకు పంచి ఇచ్చాను. ఈ తతంగంలో అందరు బాధ్యులే, అయి నా నన్ను బలి పశువును చేస్తున్నారు. తీసుకుంటే అందరిపై చర్యలు తీసుకోవాలి.
– పద్మ, వీఓఏ
ఈ కుంభకోణం వెనుక బ్యాంకు, ఇతర అధికారులు, వీఓఏ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి మహిళా సంఘాలకు మంజూరయ్యే బ్యాంకు రుణాలను మొదట ఎస్హెచ్జీ అకౌంట్లో వేయాలి. అనంతరం ఎంసీపీ వివరాల ప్రకారం, ఆ గ్రూపులో ఉన్న సభ్యుల వ్యక్తిగత అకౌంట్లలో డబ్బులు జమచేయాలి. కాని ఇక్కడ బ్యాంకు అధికారులు ఎస్హెచ్జీ అకౌంట్ నుంచి నేరుగా వీఓఏ వ్యక్తిగత ఖాతాలోకి వేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళా సమైక్య అధికారులు కూడా రుణాల పంపిణీ, చెల్లింపులపై దృష్టి పెట్టాలి. కానీ ఇవేవి లేకపోవడం వల్లే మోసం జరిగినట్లు తెలుస్తుంది.