
ప్రాజెక్టులకు జలసిరి
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు
దోమలపెంట: ఎగువ ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఆదివారం జూరాలలో ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్వే ద్వారా 79,920 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 29,296, సుంకేసుల నుంచి 67,218 మొత్తం 1,76,434 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువున శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 879.3 అడుగుల నీటిమట్టం వద్ద 184.2774 టిఎంసీల నీటి నిల్వ ఉంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,425 మొత్తం 67,740 క్యూసెక్కుల నీటిని దిగువున నాగర్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. 24గంటల వ్యవధిలో భూగర్భ కేంద్రంలో 17.109 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.461 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు.
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతో వస్తున్న ఇన్ఫ్లో వరద స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు లక్షా 20వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో లక్షా 13వేల క్యూసెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 79, 920 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29, 296 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ –2కు 750 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 1, 24,710 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.444 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు.
సుంకేసులలో 17 గేట్లు ఎత్తి నీటివిడుదల
రాజోళి: సుంకేసుల డ్యాం నుంచి నీటివిడుదల కొనసాగుతుంది. ఆదివారం ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని డ్యాం గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఆదివారం ఎగువ నుంచి 67,200 క్యూసెక్కు ల ఇన్ఫ్లో రాగా.. 17గేట్లను తెరిచి 67,218 క్యూసెక్కు లను దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
11యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి లక్ష్యం వైపుగా పరుగులు పెడుతుంది. ఈ ఏడాది 610 ఎంయూ టార్గెట్ ఉండగా.. ఇదివరకే 205 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించారు. గతేడాది జూలై మూడో వారంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 92.848 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 111.880 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 204.728 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. ప్రస్తుతం 30వేల క్యూసెక్కులను వినియోగించి విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని, వినియోగించిన నీటిని దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని తెలిపారు.
జూరాల 12గేట్లు
ఎత్తి నీటివిడుదల
ఎగువ నుంచి 1.13లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
దిగువకు 1.11లక్షల
క్యూసెక్కులు
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

ప్రాజెక్టులకు జలసిరి