
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో మంగళవారం టీఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వత్థామారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేయక ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ను గెలిపించడానికి ఆర్టీసీ ఉద్యోగులు వెన్నంటి ఉన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్లో 90 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. గతం కంటే దారుణంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, రెండు పేస్కేల్ చెల్లించాలని, చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి వారి పిల్లలకు శాశ్వత పద్ధతిన ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో సమ్మె అనివార్య పరిస్థితికి తీసుకురావద్దని కోరారు. ఒకవేళ సమ్మె వస్తే దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని కోరారు. సమావేశంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.శంకర్, కోశాధికారి రాజలింగం, రాష్ట్ర కార్యదర్శులు యాదయ్య, నిరంజన్, సత్యనారాయణ, బీఎస్.రెడ్డి, ఎండీ.వహీద్, నాగయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వీసీఎస్రెడ్డి, నల్గొండ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె,రవీందర్రెడ్డి, డీఎస్చారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య, ప్రచార కార్యదర్శి భానుప్రకాశ్రెడ్డి తోపాటు రీజియన్లో ఆయా డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అశ్వత్థామారెడ్డి