
కనిపించే దైవం..
దేవుడు మనిషికి జన్మనిస్తే.. వైద్యుడు తన వైద్యంతో పునర్జన్మనిస్తాడు. వారి ఆత్మీయ స్పర్శ రోగికి అపరసంజీవని. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరూ వైద్యుడిలో దేవుడిని చూస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తమను నమ్ముకొని వచ్చే వారి ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా సేవలందించే దైవంగా అందరి మన్ననలు అందుకుంటున్నారు వైద్యులు. మంగళవారం జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. – పాలమూరు
నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
ఎంత గొప్ప వ్యక్తి అయినా.. పేదవాళ్లు అయినా చేతులెత్తి నమస్కరించేది కేవలం వైద్యులకు మాత్రమే. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. ప్రమాదంలో గాయపడినా.. ఎలాంటి ఆపద వచ్చినా గుర్తుకు వచ్చేది వైద్యులే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, వాతావారణంలో వస్తున్న మార్పుల కారణంగా కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. రోజుకు వేల మంది రోగులకు వైద్యులు వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్నారు. కొందరు వైద్యులు మానవత్వంతో అభాగ్యులకు సేవలందిస్తూ తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. మరికొందరు వృతి ధర్మానికి కట్టుబడి మానవతా విలువలతో వైద్యసేవలు అందిస్తున్నారు.
● మహబూబ్నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల 2016లో ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు మూడు బ్యాచ్ల విద్యార్థులు వైద్యవిద్యను పూర్తిచేసుకున్నారు. 2016, 2017, 2018 సంవత్సరాల్లో 150మంది చొప్పున మొత్తం 450మంది ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని బయటకు వెళ్లారు. ప్రస్తుతం 2019 బ్యాచ్లో 175మంది హౌజ్ సర్జన్లుగా జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. 2020 నుంచి ప్రతి బ్యాచ్లో 175 మందికి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి కొత్తగా మరో 175మందికి అవకాశం కల్పించారు.
ప్రసవాలపై ప్రత్యేక దృష్టి..
నేను దామరగిద్ద మెడికల్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత ప్రతినెలా 15 కాన్పులు చేస్తున్నాం. ఈ నెలలో 26 సాధారణ కాన్పులు చేశాం. గర్భిణులకు మెరుగైన వైద్యం అందిస్తూ.. సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాం. 2016లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన తర్వాత హైదరాబాద్లో పనిచేశాను. దామరగిద్దకు డిసెంబర్లో వచ్చాను. గతంలో ప్రతినెలా ఐదు వరకు మాత్రమే సాధారణ కాన్పులు జరిగేవి.
– డా.సుదీష్ణ, మెడికల్ ఆఫీసర్, దామరగిద్ద
ఏడాదిలో 315 సాధారణ కాన్పులు..
ఏడాది కాలంలో దేవరకద్ర పీహెచ్సీలో 315 సాధారణ కాన్పులు చేశాం. సాధారణ ఓపీతో పాటు ప్రసవాలపై ఎక్కువగా దృష్టి పెట్టాను. పీహెచ్సీల వారీగా పరిశీలిస్తే.. జిల్లాలో అత్యధిక కాన్పులు ఇక్కడే అవుతాయి. హైరిస్క్ ఉన్న కేసులను సైతం బాధ్యతగా తీసుకుని ప్రసవాలు చేస్తున్నాం. నేను 2015లో ఎంబీబీఎస్ పూర్తిచేశాను. ఆ తర్వాత లట్టుపల్లి, బిజినేపల్లి, కోయిల్కొండ, మహబూబ్నగర్లో పనిచేశాను. ప్రస్తుతం దేవరకద్రలో పనిచేస్తున్నా. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నాం.
– డా.శరత్చంద్ర, దేవరకద్ర పీహెచ్సీ
కరోనా సమయంలో ఇంటింటికెళ్లి..
కరోనా సమయంలో ఇంటింటికెళ్లి చికిత్స అందించడం, ప్రతి ఒక్కరికీ ధైర్యం కల్పించడం నా జీవితంలో మరిచిపోలేను. నేను 2014లో కర్నూలులో ఎంబీబీఎస్ పూర్తిచేశా. 2017లో సర్వీస్లోకి వచ్చాను. మొదట మిడ్జిల్లో మెడికల్ ఆఫీసర్గా విధుల్లో చేరాను. డెంగీ, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం.
– డా.శివకాంత్, మెడికల్ ఆఫీసర్, మిడ్జిల్
●
ప్రతి గ్రామానికి వెళ్లి సేవలు..
కొల్లాపూర్ ఏరియాలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లి వైద్యసేవలు అందించా. ఓ అమ్మాయి డెంగీ బారినపడి పరిస్థితి ఇబ్బందిగా ఉండగా.. ఆమె ఇంటికి వెళ్లి పర్యవేక్షించాను. నేను 2015లో కడప రిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తిచేశాను. ఆ తర్వాత ఎన్ఆర్సీ, హైదరాబాద్ బస్తీ దవాఖానలో, కొల్లాపూర్లో పనిచేశా ను. గతేడాది జనవరి 1నుంచి ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్లో ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను. మంచి గైనకాలజిస్ట్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. – డా.శిరీష,
ఆర్ఎంఓ, జిల్లా జనరల్ ఆస్పత్రి

కనిపించే దైవం..

కనిపించే దైవం..

కనిపించే దైవం..

కనిపించే దైవం..

కనిపించే దైవం..