
జూరాలకు కృష్ణమ్మ పరవళ్లు
ధరూరు/ఆత్మకూరు/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం రాత్రి 7 గంటలకు 98 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ద్వారా 73,998 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలోని ఎగువ, దిగువ 11 యూనిట్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం 27,461 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు. కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కులు.. ప్రాజెక్టు నుంచి మొత్తం 1,03,307 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.389 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా.. ఎగువ విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్ల ద్వారా 61.621 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 70.393 ఎంయూ, మొత్తం 132.014 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు.
● జూరాల స్పిల్ వే, విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు 1,01,459 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 863.1 అడుగుల నీటిమట్టంతో 115.7856 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్ఐకు 1,144 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
19 అడుగులకు కేఎస్పీ నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిమట్టం గురువారం సాయంత్రం వరకు 19 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు అలుగు స్థాయి 26.6 అడుగులు. అయితే ఈ నెల 1వ తేదీన 11 అడుగులుగా ఉండగా.. 26 రోజుల్లో 8 అడుగుల మేర పెరిగింది. జూరాలకు ఇన్ఫ్లో ప్రారంభం అయిన తరువాత కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉంద్యాల ఫేస్ వన్ నుంచి ఒక పంపును రన్చేసి నీటిని విడుదల చేశారు. ఈనెల 6 వ తేదిన తీలేరు వద్ద ఉన్న ఫేస్ టు పంప్హౌస్ నుంచి ఒక పంపును రన్ చేసి నీటిని కోయిల్సాగర్కు వదిలారు. ఒక పంపు ద్వారా 315 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది.
98 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత
శ్రీశైలం ప్రాజెక్టులకు లక్ష క్యూసెక్కుల వరద