
పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నూతన కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో సెక్రెటరియేట్లో పీయూకు సంబంధించి ఈసీ (ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, విద్యా శాఖల అధికారులతోపాటు పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబుతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పీయూలో నూతనంగా ప్రారంభించే లా, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈసీ ఆమోదం తెలిపింది. అలాగే విద్యార్థులకు కల్పించే వసతులు, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇక టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి ఆమోదం కూడా జరిగింది. కానీ, ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉందని వీసీ పేర్కొన్నారు. అంతేకాకుండా పీయూలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి మెడికల్ రీయింబర్స్మెంట్ అవకాశం కల్పించే దానికి కూడా అనుమతించారు.
137 మంది సిబ్బంది..
పీయూలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై ఈసీలో చర్చ జరిగింది. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం 137 మంది సిబ్బంది వివరాలను ఇప్పటికే అధికారులు ఈసీ ముందు ఉంచగా దీనిపై పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో పీయూలోని పీజీ కళాశాల ప్రారంభంలో ఇచ్చిన జీఓ, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ వంటి పీజీ కళాశాలల ఏర్పాటు క్రమంలో ఇచ్చిన జీఓ సిబ్బంది నియామకానికి ఇచ్చిన అనుమతులపై ఈసీలో ప్రభుత్వ అధికారులు ప్రశ్నించారు. దీనిపై పీయూ అధికారులు పూర్తిస్థాయిలో వారు అడిగిన వాటికి సమాచారం అందించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటే త్వరలో నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు పెరిగే అవకాశం ఉందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు వీసీ చెప్పారు.
ఆమోదం తెలిపిన ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్
వసతుల కల్పన, టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకానికి సైతం అనుమతులు
నాన్టీచింగ్ సిబ్బంది వేతనాలపెంపుపై చర్చ
రెగ్యులర్ అధ్యాపకులకు మెడికల్ రీయింబర్స్మెంట్