ఇంటర్‌లో ఆరుగురు విద్యార్థుల డీబార్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఆరుగురు విద్యార్థుల డీబార్‌

Mar 21 2023 1:58 AM | Updated on Mar 21 2023 1:58 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డీబార్‌ అయ్యారు. సోమవారం మొదటి సంవత్సరం వారికి గణితం, బాటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో కోయిల్‌కొండ పరీక్ష కేంద్రాన్ని స్క్వాడ్‌ బృందం తనిఖీ చేయగా ఆరుగురు విద్యార్థులు చీటీలు రాస్తూ పట్టుబడ్డారు. పరీక్షకు మొత్తం 11,349 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 10,909 మంది హాజరవగా.. 440 మంది గైర్హాజరయ్యారు. మరో ఆరుగురు డీబార్‌ అయ్యారు.

9 మంది ఇన్విజిలేటర్ల తొలగింపు

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాగంగా అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ పరీక్ష కేంద్రాలు సమస్యాత్మకం కావడంతో అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో స్క్వాడ్‌ బృందం అడ్డాకుల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం కోయిల్‌కొండకు వెళ్లారు. ఇక్కడ ఆరుగురు విద్యార్థులు చీటీలు రాస్తూ పట్టుబడటంతో ఇందుకు బాధ్యులను చేస్తూ 9 మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించినట్లు డీఐఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే వీరంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందే అని తెలుస్తుంది. వీరి స్థానంలో విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయులకు పరీక్ష విధులు కేటాయించారు.

నేడు అవగాహన సదస్సు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సకాలంలో టీడీఎస్‌ చెల్లింపులు, త్రైమాసిక నివేదికల సమర్పణ తదితర అంశాలపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రవినాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా అధికారులు, డ్రాయింగ్‌, డిస్బర్సింగ్‌ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో అన్ని రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు, ఇతర చెల్లింపులపై టీడీఎస్‌ 16, 16/ఏ ఫారాల సమర్పణలో ఇబ్బందులు తదితర అంశాలపై ఆదాయపు పన్ను శాఖ ఐఆర్‌ఎస్‌ అధికారి, జాయింట్‌ కమిషనర్‌ కృష్ణకుమార్‌, ఆదాయపు పన్ను అధికారి మధుసూదన్‌రావు హైదరాబాద్‌ నుంచి శిక్షణ ఇస్తారన్నారు.

డిమాండ్లు

నెరవేర్చకుంటే ఉద్యమం

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): విద్యుత్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే పెద్దఎత్తున ఉద్యమం చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని విద్యుత్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్‌ చంద్రమౌలి అన్నారు. సోమవారం స్థానిక విద్యుత్‌ భవనంలో విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఈపీఎఫ్‌, జీపీఎఫ్‌ అమలు చేయాలని, ఆర్టిజన్‌, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని విడతల వారీగా పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 24న విద్యుత్‌ సౌధ ఎదుట మహాధర్నాకు పూనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ధర్నాతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మహాధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం చైర్మన్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement