మెడకు బెల్ట్‌ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి.. | - | Sakshi
Sakshi News home page

మెడకు బెల్ట్‌ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి..

Jul 2 2025 6:49 AM | Updated on Jul 2 2025 6:49 AM

మెడకు బెల్ట్‌ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి..

మెడకు బెల్ట్‌ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి..

కాజీపేట : మెడకు బెల్ట్‌ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి.. కూరగాయలు కోసే కత్తితో ఫైనాన్స్‌ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కాజీపేట పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పింగిళి ప్రశాంత్‌ రెడ్డి.. సీఐ సుధాకర్‌ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్‌ శివనగర్‌కు చెందిన త్రిపురాధి నవీన్‌కుమార్‌ (55) చిరువ్యాపారులకు ఫైనాన్స్‌ ఇస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో సహజీవనం చేస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు గుండా రజని( ఇందులో ప్రస్తుతం రజనీ ఉద్యోగం కోల్పోయింది.) , గడ్డం ప్రవీణ్‌కుమార్‌.. నవీన్‌కుమార్‌ వద్ద రూ.30 వేల అప్పు తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ.50 వేలకు పెరిగింది. ఈ డబ్బు చెల్లించాలంటూ నవీన్‌కుమార్‌ కొంత కాలంగా ప్రవీణ్‌కుమార్‌ను వేధిస్తున్నాడు. అప్పటికే పలు నేరాలతో సంబంధం ఉండి జైలుకెళ్లొచ్చి ఉద్యోగం కోల్పోయిన రజని, ప్రవీణ్‌కుమార్‌.. నవీన్‌కుమార్‌పై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవాలనుకున్నారు. ఏ విధంగానైనా ఫైనాన్స్‌ వ్యా పారిని హత్య చేసి ఆభరణాలు కాజేసి కుటుంబ అప్పులు, అవసరాలు తీర్చుకోవాలని భావించి నవీన్‌ కుమార్‌కు శుక్రవారం ఫోన్‌ చేసి రైల్వే క్వార్టర్స్‌కు పిలిపించారు. అయితే అప్పు చెల్లిస్తారనే నమ్మకంతో వచ్చిన వ్యాపారి నవీన్‌కుమార్‌ మెడకు ప్రవీణ్‌ బెల్ట్‌ బిగించి ఊపిరి ఆడకుండా చేయగా, రజని కాళ్లను చున్నీతో కట్టివేసింది. అనంతరం కూరగాయలు కోసే కత్తితో పొడవడంతో పాటు బండరాయితో తలపై మోది నవీన్‌కుమార్‌ను హత్య చేశారు. తర్వాత నిందితులు మృతదేహాన్ని మా యం చేయాలని భావించగా ఎవరూ సహకరించకపోవడంతో చేసేదేమి లేక పరారయ్యారు.

హత్య అనంతరం పరారైన రజని..

ఫైనాన్స్‌ వ్యాపారి నవీన్‌కుమార్‌ను హత్య చేసిన అ నంతరం రజనీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మర్రిగూడెం గ్రామానికి చేరుకుంది. ప్రవీ ణ్‌ పట్టణంలోనే ఉండి పోలీసుల కదలికలు ఎప్ప టికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మర్రిగూడెంలో ఉన్న రజనిని అరెస్ట్‌ చేసి 16.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కడిపికొండ క్రాస్‌లో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు ప్రవీణ్‌కుమార్‌ పట్టుబడ్డాడు.

ఇద్దరిది నేర చరిత్రే..

కాజీపేట రైల్వే ఎలక్ట్రికల్‌ షెడ్‌లో పని చేస్తున్న రజని, ప్రవీణ్‌కుమార్‌ 2013 నుంచి సహజీవనం కొనసాగిస్తున్నారు. కాగా, ప్రవీణ్‌కుమార్‌ తన భార్య రేణుకను అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె 2018లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో రజని, ప్రవీణ్‌కుమార్‌ జైలుకెళ్లొచ్చారు. జైలులో సహ నిందితులతో పరిచయం ఏర్పడింది. వారి సూచనల మేరకు ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి డబ్బులు వసూలు చేయగా బసంత్‌నగర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దీంతో ఉద్యోగాలు పోవడంతో ఇద్దరు సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగనోట్ల వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడగా సుబేదారి, మట్టెవాడ, పాలకుర్తి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఫైనాన్స్‌ వ్యాపారిని హత్య చేసిన నిందితులు

ఇద్దరి అరెస్ట్‌.. 16.5 తులాల బంగారం స్వాధీనం

వివరాలు వెల్లడించిన పోలీసులు

రౌడీషీట్‌, పీడీ యాక్ట్‌ నమోదు ..

నిందితులు రజని, ప్రవీణ్‌కుమార్‌పై వెంటనే రౌడీషీట్‌ తెరవడంతోపాటు పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్లు ఏసీపీ ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన సీఐ వై.సుధాకర్‌ రెడ్డి, ఎస్సైలు నవీన్‌కుమార్‌, సర్వేశ్వర్‌, సిబ్బంది శ్రీధర్‌, బి.భాస్కర్‌, విష్ణు, కె.శ్రీనివాస్‌ను ఏసీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement