
డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు!
● రెండు నెలల క్రితం
ఇంటర్ ఫలితాలు విడుదల
● డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వని
కూటమి ప్రభుత్వం
● మేజర్ సబ్జెక్ట్ విధానంపై
నిర్ణయంలో జాప్యం
● ప్రైవేట్ కళాశాలలకు క్యూ కడుతున్న
విద్యార్థులు
జిల్లాలో డిగ్రీ కళాశాలల వివరాలు..
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 11
ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 28
మొత్తం 39
ప్రభుత్వ డిగ్రీ విద్యను
అభ్యసిస్తున్న బాలురు 1,814
బాలికలు 1,841
మొత్తం 3655
ప్రైవేటు డిగ్రీ కళాశాలలో
చదువుతున్న విద్యార్థులు
బాలురు 1,343
బాలికలు 1,544
మొత్తం 2,987
నంద్యాల(న్యూటౌన్): డిగ్రీ కోర్సుల్లో నూతన అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభమవుతో తెలియక పోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తయి తరగతులు ప్రారంభమయ్యాయి. డిగ్రీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు డిగ్రీ ప్రవేశాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలోని శ్రీశైలం, ఆత్మకూరు, నంద్యాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 11 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 55 ప్రైవేటు కళాశాలలు ఉండగా 66 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను సులువుతరం చేసేందుకు గత వైఎస్సార్సీపీ సర్కారు 2022–23లో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సులువుగా ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు పొందేవారు. కూటమి ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి తిరిగి ఆఫ్లైన్లో అడ్మిషన్లు చేపట్టేందుకు కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసమే అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. డిగ్రీ తరగతులపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. గతంలో ఉన్న మూడు సబ్జెక్టుల విధానాన్ని రద్దు చేసి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని అమలు చేసింది. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సింగిల్ మేజర్ లేదా డబుల్ మేజర్ సబ్జెక్టుల విధానం అమలు గురించి ఉన్నత విద్యా మండలి సవివరంగా ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఈ విషయంపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేక జాప్యం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు కళాశాలకు అనుకూలం..
అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలలోజరుగుతున్న జాప్యాన్ని ప్రైవేటు కళాశాలలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. రెండు నెలల క్రితమే ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో విద్యార్థులను చేర్చుకోవడంతో పాటు మార్కుల జాబితాను, టీసీ, ఇతర సర్టిఫికెట్లను ప్రైవేట్ కళాశాలలు సేకరించాయి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇప్పటికే చేరినవారిని దరఖాస్తు చేయించి తమ కళాశాలలను ఆప్షన్లుగా ఎంచుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇటీవల ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అయినా కూడా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించినా అది నెలకు పైగా సాగుతుంది. గతంలో రెండు నెలల సమయం వరకు షెడ్యూల్ ఇచ్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ నిర్వహించే వారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు షెడ్యూలే ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. తొలి విడతలో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మరో రెండు విడతలు ప్రక్రియ నిర్వహించాలి. ఇదంతా జరిగి క్లాసులు ప్రారంభమయ్యే సరికి ఆగస్టు నెల వచ్చేస్తుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
నోటిఫికేషన్ విడుదల చేయాలి
కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల అలసత్వ వైఖరి చూపించడం సరికాదు. డిగ్రీ కళాశాలలు ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా ఇంత వరకు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దారుణం. ప్రైవేట్ కళాశాలలకు మేలు చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. వెంటనే అడ్మిషన్ల నోటిఫికేషను విడుదల చేయాలి. లేని పక్షంలో ఆందోళనలు చేపడతాం.
– సురేష్యాదవ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం
అధ్యక్షుడు, నంద్యాల జిల్లా

డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు!