
నందవరం : కులం పేరుతో దూషించాడని మండల పరిధిలోని నాగలదిన్నె గ్రామంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ తిమ్మయ్య, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నాగలదిన్నె గ్రామానికి చెందిన మాల పరశరాముడు, పార్వతి దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు సంతానం. రెండో కుమార్తె రేణుకను రెండు నెలల క్రితం బోయ మారెప్ప అనే యువకుడు తీసుకెళ్లాడు. దీనిపై ఎమ్మిగనూరు టౌన్ పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టగా పోలీసులు ఇరువురిని తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వారిని పంపారు.
అయితే, ఆ మరుసటి రోజు రేణుక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి మారెప్ప.. పరశరాముడి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించేవాడు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో సైతం పరశరాముడు రెండో కుమారుడైన మహేష్కుమార్ (22)ను తిట్టి అవమానించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉదయం 9:00 గంటల సమయంలో ఊరి బయట ఉన్న తమ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారడు. ఈ మేరకు మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.