
దుర్గమ్మ సన్నిధిలో మొరాయిస్తున్న స్టేర్ లిఫ్ట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సుమారు రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు స్టేర్ లిఫ్ట్ తరచూ మొరాయిస్తుండడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, వికలాంగులు స్టేర్ లిఫ్ట్ను సద్వినియోగం చేసుకుని స్కానింగ్ పాయింట్ వరకు చేరుకుంటున్నారు. అయితే ఈ లిఫ్ట్ తరచుగా మొరాయిస్తోంది. ప్రారంభించిన 7 నెలల కాలంలో ఎక్కువ సార్లు మరమ్మతులకు గురికావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టేర్ లిఫ్ట్ను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే అంటే గత ఏడాది నవంబర్ 8న మొదటిసారిగా నిలిచిపోవడంతో టెక్నికల్ సిబ్బంది మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఓ సారి ఈ స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడం పరిపాటిగా మారింది. గత మూడు రోజులుగా స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడంతో ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది టెక్నీషియన్ను పిలిపించారు. ఆరు బయ ట వర్షం నీరు పడటంతో మోటరు పాడైపోయిందని చెప్పారు. అయితే స్టేర్ లిఫ్ట్కు ఏడాది పాటు వారంటీ ఉండటంతో కంపెనీనే పూర్తి బాధ్యత వహిస్తుందని చెబుతున్నా, ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది భక్తుల ప్రశ్న. స్టేర్ లిఫ్ట్ ఏర్పాటు చేసే సమయంలోనే మెట్లపై వర్షం నీరు పడకుండా షెడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.