
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకి బాలుడి ఘనత
హుబ్లీ: పాత హుబ్లీ ఇంద్రప్రస్థ నగర్ నివాసి సుస్విన్ అతి తక్కువ సమయంలో ఎక్కువ దూరం సైకిల్ తొక్కడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును దాఖలు చేసి ఘనత సాధించాడు. 4.8 ఏళ్ల సుస్విన్ 39.24 నిమిషాల్లో 11.18 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం ద్వారా అందరినీ ఆశ్చర్య పరిచాడు. కాగా ఇంతకు ముందు 5.3 ఏళ్ల తమిళనాడు చిన్నారి అదవ్ అశోక్కుమార్ అనే బాలుడు 10.3 కిలోమీటర్ల దూరాన్ని 39.44 నిమిషాల్లో అధిగమించాడు. దీన్ని సవాల్గా తీసుకున్న సుస్విన్ 2025 ఏప్రిల్ 5న సత్తూరు ఆశ్రయ కాలనీ నుంచి ఉదయం 6.40 గంటలకు సైక్లింగ్ ప్రారంభించి 7.19 గంటలకు ఉణకల్ క్రాస్ వరకు తొక్కి ఘనత చాటాడు. ప్రతి రోజు హుబ్లీ ఆనంద్నగర్ చుట్టు పక్కల ప్రాంతంలో తండ్రి వినాయక్ బాలుడికి సైక్లింగ్లో శిక్షణ ఇచ్చే వారు. రోజు అభ్యాసం చేస్తూ అలాగే అభ్యాసాన్ని రెట్టింపు చేసుకుంటూ చివరుకు 11 కిలోమీటర్ల దూరాన్ని 39.05 నిమిషాల్లో చేరుకున్నాడు.
రింగ్ రోడ్డులో సాధన షురూ
తొలుత హుబ్లీ రింగ్ రోడ్డులో సైకిల్ తొక్కడం ప్రారంభించి ఆ తర్వాత జంట నగరాల్లోని రోడ్లల్లో తొక్కడం ప్రారంభించారు. అనంతరం అభ్యాసంతో సైకిల్ రైడింగ్ అలవాటు చేసుకున్నాడని బాలుడి తల్లి సుష్మ తెలిపారు. పిల్లల ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో కీలకం అన్నారు. సుస్విన్ సైక్లింగ్లో సాధన ప్రారంభించిన వేళ మేమందరం చిన్నారికి మద్దతుగా నిలిచామన్నారు. ప్రస్తుతం చిరంజీవి రికార్డు సాధించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తండ్రి వినాయక హళపేటె మాట్లాడుతూ తమిళనాడు బాలుడు రికార్డును బద్దలుగొట్టాలన్న లక్ష్యంతోనే కుమారుడు సుస్విన్కు నిరంతరం శిక్షణ ఇచ్చానున్నారు. ఆ విధంగా బాలుడు ప్రతి రోజు రెండు గంటలు ప్రాక్టీస్ చేయించేవాడినని, ప్రస్తుతం కుమారుడి రికార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దాఖలు చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు.
11 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి చరిత్ర సృష్టించిన బాలుడు