
గీత దాటిన బల్దియా!
కార్పొరేషన్ కహానీ–3
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కన్నా అక్రమాలే అధికం. కాంట్రాక్టర్లంటే అమితమైన అభిమానం ప్రదర్శించడం, ఒకే కంపెనీకి, కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టడం ఇక్కడ సాధారణ విషయం. కిందిస్థాయి సిబ్బంది గురించి పక్కనపెడితే, మున్సిపల్ కమిషనర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. నిధుల దుర్వినియోగం విషయంలో చిన్నా చితకా అధికారుల మీద కాదు.. సాక్షాత్తూ మున్సిపల్ కమిషనర్ మీదే పోలీసు కేసు నమోదు అవడంతో కరీంనగర్ బల్దియా అవినీతికి పరాకాష్టగా నిలిచింది. గతేడాది నమోదైన కేసులో పురోగతి కోసం మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెంటబడటం మరోసారి చర్చానీయాంశంగా మారింది. తన పరిధి కాకున్నా.. సమీప విలీన గ్రామాల్లోకి చొచ్చుకెళ్లి మరీ రూ.కోట్లు ఖర్చు పెట్టడం కరీంనగర్ మున్సిపల్ కమిషనర్లు, అధికారులకే చెల్లింది.
గీత దాటిన అధికారులు..
కరీంనగర్ స్మార్ట్సిటీ పనులు నగరంలోనే జరగాలి. స్మార్ట్సిటీ మిషన్ కింద కరీంనగర్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఎస్సీసీఎల్)ను అనే స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేశారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్ను ఒక పర్యాటక, వాణిజ్య నగరంగా తీర్చిదిద్దడం దీని ఉద్దేశం. నగరంలోని 50 డివిజన్లలో కాకుండా పరిధిదాటి.. స్మార్ట్సిటీ నిధులను వెచ్చించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వాస్తవానికి బొమ్మకల్ మొన్నటి వరకు గ్రామ పంచాయతీ. ఈ ఏడాది ఆరంభంలోనే దాన్ని బల్దియాలో ప్రభుత్వం విలీనం చేసింది. 2022లో బొమ్మకల్ జంక్షన్ పనులను బల్దియా చేపట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనిపై మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ నిధుల దుర్వినియోగమేనని వన్టౌన్లో కేసు (ఎఫ్ఐఆర్ 480/2024) నమోదు చేశారు. అందులో ఏ–1గా అప్పటి మున్సిపల్ కమిషనర్, ఏ–2 సూపరింటెండెంట్ ఇంజినీర్, ఏ–3గ్రా ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ను చేర్చారు. అయినప్పటికీ.. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదు. దాంతోపాటు బొమ్మకల్ వరాహ స్వామి టెంపుల్ నుంచి లారీ అసోసియేషన్ వరకు స్మార్ట్సిటీ నిధులతో రోడ్లు, డ్రెయిన్, కల్వర్టులు నిర్మించారు. రేకుర్తిలోనూ స్మార్ట్సిటీ నిధులతో పలు కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, బ్యూటిఫికేషన్, హైమాస్ట్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు.
బొమ్మకల్, రేకుర్తిల్లోనూ స్మార్ట్సిటీ పనులు
పరిధి కాకున్నా హద్దుమీరి నిర్వహణ
కరీంనగర్ కార్పొరేషన్ సొమ్ము రూ.కోట్లు పక్కదారి
నిధుల దుర్వినియోగం కేసులో ఏ–1గా మున్సిపల్ కమిషనర్
ముందుకు సాగని పోలీసుల దర్యాప్తు
రూ.కోట్లాది నిధులు పక్కదారి..
బొమ్మకల్, రేకుర్తిలో రూ.కోట్లాది స్మార్ట్సిటీ నిధులు వెచ్చించి అనేక పనులు చేశారు. ఈ విషయంలో వన్టౌన్లో కేసు నమోదు అయిన సమయంలో పలువురు కార్పొరేటర్లు మరిన్ని ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్లతో వారిని నిలువరించగలిగారు. అదే సమయంలో గ్రామ పంచాయతీగా ఉన్న బొమ్మకల్లో వికలాంగుల పార్కు కోసం దాదాపుగా రూ.4 కోట్ల వరకు విలువైన పనులకు పరిపాలన అనుమతి, టెండరు ఖరారు కూడా చేశారు. ఆఖరు నిమిషంలో ఆ టెండరు రద్దు అయింది. లేకపోతే.. పార్కు పనులు కూడా బొమ్మకల్లో నిర్వహించేవారే.

గీత దాటిన బల్దియా!