
బల్దియాకు నయా బాస్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్గా ఆర్వీ కర్ణన్ నియమితులయ్యారు. ప్రస్తుతం బల్దియా కమిషనర్గా ఉన్న ఇలంబర్తికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు. ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కమిషనర్గా కె.శశాంకను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్వీ కర్ణన్.. తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఫారెస్ట్రీ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశారు. 2007లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షలో టాపర్గా నిలిచారు. అనంతరం 2012లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా, కరీంనగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్గా పని చేశారు. ప్రస్తుతం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్గా ఉన్న కర్ణన్.. ఫుడ్సేఫ్టీ కమిషనర్గానూ బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆహార కల్తీలపై విస్తృతంగా తనిఖీలు చేయించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో తనిఖీలపై ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆహార కల్తీలను గుర్తించినప్పుడు హోటళ్ల లైసెన్సులు రద్దు చేయడం తదితర అధికారాలను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ.. వారిని ఇన్చార్జి ఫుడ్సేఫ్టీ డిజిగ్నేటెడ్ అధికారులుగా నియమించారు. ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాక పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో ఇలంబర్తిని జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించిన ప్రభుత్వం.. ఆయనను నవంబర్లో రెగ్యులర్ కమిషనర్గా నియమించింది. దాదాపు ఆర్నెల్లకే బదిలీ చేయడంతో జీహెచ్ఎంసీ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందనే వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. రోనాల్డ్రాస్, ఆమ్రపాలి సైతం స్వల్పకాలం మాత్రమే జీహెచ్ఎంసీ కమిషనర్లుగా పని చేయడం తెలిసిందే. కాగా హెచ్ఎండీఏ సెక్రటరీగా ఆర్.ఉపేందర్ రెడ్డి బదిలీపై వచ్చారు.
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెక్రటరీగా ఇలంబర్తి
ఎఫ్సీడీఏ కమిషనర్గా శశాంక నియామకం