ఎమ్మెల్సీ పేరుతో ‘మట్టి’ దందా
రాజధాని గ్రామాల్లో జేబులు నింపుకొంటున్న తమ్ముళ్లు నామమాత్రంగా అప్పుడప్పుడు వాహనాలు సీజ్
తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొంతమంది టీడీపీ నాయకుల పేరు చెబుతూ అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ జేబులు నింపుకొంటున్నారు. మట్టి మాఫియాపై సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడల్లా సీఆర్డీఏ అధికారులు, పోలీసులు నామమాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. అక్రమ రవాణా చేస్తున్న 8 మట్టి లారీలను తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి పోలీసులు బుధవారం సీజ్ చేశారు. ఆ వెంటనే ఓ వైట్ కాలర్ మట్టి మాఫియా వ్యక్తి పోలీస్స్టేషన్కు కారులో వచ్చాడు. ఆ కారును పోలీస్స్టేషన్కు అడ్డంగా పెట్టి ‘నేను ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తాలూకా, మా బళ్లు ఎందుకు సీజ్ చేశారంటూ’ హడావుడి చేశాడు. పోలీసులు మాత్రం సీజ్ చేసిన ఆ బళ్లు వదిలేది లేదని తేల్చి చెప్పారు. సదరు వ్యక్తి రాజధాని గ్రామాల్లో దౌర్జన్యం చేసే కొంతమందిని తన పక్కన పెట్టుకుని కారులోనే కూర్చుని ఒక్కో లారీ నుంచి రూ.వెయ్యి, రూ.2 వేల వరకు సీనరేజ్ కింద వసూలు చేస్తున్నాడు. ఎక్కడ మట్టి కావాలో లారీ యజమానులకు చెప్పి వారి నుంచి డబ్బులతోపాటు మట్టి తోలకాలు ఇచ్చినందుకు డబ్బులు తీసుకోవడం విశేషం.
నాడు అనుమతులు ఉన్నా...
గతంలో ప్రభుత్వ హయాంలో అనుమతులతో మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్నపుడు అప్పటి ఎమ్మెల్యే ఆర్కేకి అనుమతులు లేవంటూ నిలదీసిన వ్యక్తే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో సదరు వ్యక్తితో కలిసి దందాలు చేస్తున్నట్లు సమాచారం. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ వెనుక మహానాడు కట్టపై నివాసం ఉంటూ మంగళగిరి, తాడేపల్లి పోలీస్స్టేషన్లలో రాజధాని పరిధిలో పలు దొంగతనాల్లో ప్రధాన ముద్దాయి అయిన రౌడీషీటర్ కూడా లారీలను లీజ్కు తీసుకుని మట్టి దందా చేస్తున్నాడు. రాజధానికి పంట పొలాలు ఇచ్చిన రైతులు జరిగిన ఈ సంఘటనపై, జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై ప్రశ్నిస్తుంటే దౌర్జన్యం చేస్తున్నారు. వారిని కొంతమంది గ్రామస్తులతో బెదిరించి ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది.


