ఐశ్వర్య ప్రదాయినిగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు ఐశ్వర్య ప్రదాయినిగా దర్శనమిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అమ్మవారి భక్తులు చందోలు గ్రామానికి వచ్చి బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
పెదకాకాని: భక్తుల సౌకర్యార్థం పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. శివాలయానికి విచ్చేసే భక్తులు ఆలయంలో వసతి గదులు, దర్శనాలు, రాహు కేతు పూజలు, స్వామి వారి అభిషేకాలు, చండీ రుద్ర హోమ పూజలు ఇతర సేవలు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ప్రసాదాల టోకెన్ల విక్రయాలు సైతం ఆన్లైన్లో ఉండటం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా వివిధ సేవలు, దర్శనాల టికెట్స్ బుక్ చేసుకోవడంతోపాటు ప్రసాదం టోకెన్లు పొందిన భక్తులను ఆలయం వద్ద సాధారణ క్యూలైన్లో ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా త్వరితగతిన దర్శనం, ప్రసాదాలు పొందుటకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు వివిధ సేవల కోసం ఆలయ వెబ్సైట్ ద్వారా కానీ మనమిత్ర వాట్స్యాప్ నెంబరు 95552300009 ద్వారా క్రెడిట్కార్డు, డెబిట్కార్డు, గూగుల్ పే, ఫోన్పే, పేటీయం, బీమ్ యూపీఎల్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి ఆయా సేవల టికెట్లు పొందవచ్చని డీసీ తెలిపారు.
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శని, ఆదివారం పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించారు. దీంతో లాంచీ స్టేషన్కు లక్షా 20 వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు లాంచీ యూనిట్ మేనేజర్ కె మస్తాన్బాబు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు.
ఐశ్వర్య ప్రదాయినిగా బగళాముఖి అమ్మవారు
ఐశ్వర్య ప్రదాయినిగా బగళాముఖి అమ్మవారు


