
కోటప్పకొండపై తొలి ఏకాదశికి ఏర్పాట్లు
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రత్యేక క్యూలైన్లలో ఉచిత, ప్రత్యేక, శీఘ్ర, అభిషేక దర్శనాలను కల్పించనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచారు. స్వామి వారి ప్రసాదాలైన లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు. భక్తులు స్వామి వారిని ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. నరసరావుపేట నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమయింది. అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.