
కేంద్ర ఆరోగ్య పథకం ఎల్ఏసీ మెంబర్గా గుమ్మడి
లక్ష్మీపురం: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లోకల్ అడ్వైజరీ కమిటీ(ఎల్ఏసీ) సభ్యునిగా గుంటూరుకు చెందిన విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్యని నియమిస్తూ సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తరఫున నియమితులైన సీతారామయ్యని శుక్రవారం సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ కన్నవారితోటలోని కార్యాలయంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సీతారామయ్య కృషి చేయాలని సూచించారు. సీజీహెచ్ఎస్ పరిధిలోకి మరిన్ని ఎంప్యానల్డ్ ఆసుపత్రులను తీసుకురావాలని కోరారు. డిపార్ట్మెంట్కు చేసిన సేవలు అందించిన సీతారామయ్యకు ఈ హోదా దక్కడం శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.విశ్రాంత జీవితంలో సేవ చేసే బాధ్యత ఇచ్చిన సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిణికి సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సెంట్రల్ జీఎస్టీ పెన్షనర్ల సంఘ నేతలు టి.వివేకానంద, గద్దె తిలక్, పి.వి.సత్యనారాయణ, పి.కోటేశ్వరరావు, ఎన్.ఎస్. నగేష్ బాబు, కె.సామ్రాజ్యం పాల్గొన్నారు.