శ్రీవారి అంతరాలయ దర్శనం రద్దు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి అంతరాలయ దర్శనం రద్దు

Jun 8 2025 12:50 AM | Updated on Jun 8 2025 12:50 AM

శ్రీవ

శ్రీవారి అంతరాలయ దర్శనం రద్దు

ద్వారకాతిరుమల: భక్తుల రద్దీ దృష్ట్యా ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు స్వామి వారి అంతరాలయ దర్శనాన్ని శనివారం ఐదు గంటల పాటు రద్దు చేశారు. దీంతో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వచ్చిన వారికి, వీఐపీలకు షాక్‌ తగిలింది. కాగా అధికారులు తీసుకున్న నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేయాలని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి ఆదేశించారు. అంతే కాకుండా అధిక సమయం అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఎవరైనా ఈ నిర్ణయాన్ని అతిక్రమిస్తే చర్యలు చేపడతానని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో వచ్చిన వారికి, వీఐపీలకు చుక్కెదురైంది. అయితే అధికారులు వారికి నచ్చజెప్పి కొండపైన గదుల్లో వసతి కల్పించి, మధ్యాహ్నం నుంచి అంతరాలయ దర్శనం చేయించారు.

సౌకర్యాలపై ఆరా : భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఈఓ సత్యనారాయణమూర్తి స్వయంగా పరిశీలించారు. ఆలయంలో భక్తుల వద్ద ఉన్న దర్శనం టికెట్లను ఆయన పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతో మాట్లాడి, రుచి, నాణ్యతపై ఆరా తీశారు. ప్రసాదం కౌంటర్లు, ఇతర విభాగాలను తనిఖీ చేశారు.

రూ.43 లక్షలు ఆదాయం: శ్రీవారిని 30 వేల మంది భక్తులు దర్శించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, స్వామివారి నిత్యార్జిత కల్యాణాలు, విరాళాలు, ఇతర సేవా రుసుముల ద్వారా రూ.43 లక్షల ఆదాయం సమకూరిందన్నారు.

క్షేత్రం కిటకిట.. హరినామమే అందరి నోట

శ్రీవారి క్షేత్రం భక్తజన సంద్రాన్ని తలపించింది. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. దీంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివెట్టి మండపం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్‌ కౌంటర్లు, కేశఖండనశాల, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు ఆలయ ఆవరణలో బారులు తీరారు. అనివేటి మండపంలో భజన మండలి సభ్యుల కోలాట నృత్యాలు అలరించాయి. స్వామివారి కొండపైన ఘాట్‌ రోడ్డులో భక్తుల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. రాత్రి వరకూ క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

చిన వెంకన్న క్షేత్రం.. భక్త జన సంద్రం

5 గంటల పాటు నిలిపివేసిన అంతరాలయ దర్శనం

శ్రీవారి అంతరాలయ దర్శనం రద్దు 1
1/1

శ్రీవారి అంతరాలయ దర్శనం రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement