
పరిశోధనలతో దేశ సమస్యలకు చెక్
● నీతి అయోగ్ సభ్యుడు సారస్వత్
● వికసిత్ భారత్పై జీజీయూలో సదస్సు
రాజానగరం: దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన శాస్త్ర వేత్తలు తమ శాస్త్ర పరిశోధనలతో పరిష్కారం చూపాలని నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో రెండు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. సదస్సులో శ్రీవికసిత్ భారత్ – 2047 కోసం పరిశోధనలు, నవీకరణలను ఉపయోగించడంశ్రీ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్పై పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయని, కానీ వికసిత్ భారత్ అంటే.. శ్రీఅభివృద్ధి చెందిన దేశం కోసం రూపొందించిన రోడ్డు మ్యాప్శ్రీ అని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న పోషకాహార లోపం, మాతా–శిశు మరణాలు వంటి పలు సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. వీటి సాధనకు పరిశోధనలు అవసరమని, వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని, తద్వారా గ్లోబల్ లీడర్గా మార్పు చెందవచ్చన్నారు. సెమీ కండక్టర్లు, కృత్రిమ మేథ మొదలైన అంశాలలో పరిశోధన ద్వారా స్వయం సమృద్ధి సాధించి ఆత్మ నిర్భర భారత్గా మారవచ్చన్నారు. మన దేశ జీడీపీలో 62 శాతం సేవా రంగాల నుంచి వస్తుంటే కేవలం 14 శాతం మాత్రమే తయారీ రంగం నుంచి వస్తోందని, ఇది ఒక ప్రధాన సమస్యగా ఉందన్నారు. విలువల జోడింపే నూతన ఆవిష్కరణ లక్ష్యమని సారస్వత్ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి అంతా కంప్యూటర్ సైన్స్ పైనే ఉందని, ఇదే పరిిస్థితి కొనసాగితే దేశంలో రైల్వేలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి వాటికి మావన వనరుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2047 నాటికి 100 గిగా వాట్ల అణుశక్తి అవసరమని, అందుకనే న్యూక్లియర్ సైన్స్ చదివితే మంచి అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్సెలర్ కేవీవీ సత్యనారాయణరాజు, ప్రొ ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.