
అనుమానంతో స్నేహితునిపై కత్తితో దాడి
కొత్తపేట: తన భార్య విషయంలో స్నేహితుడిపై అనుమానంతో ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. వానపల్లి గ్రామానికి చెందిన మానుపాటి రాజేష్ మోడేకుర్రు గ్రామానికి చెందిన పితాని సతీష్ను కత్తితో గాయపర్చిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై జి. సురేంద్ర తెలిపిన వివరాల మేరకు రాజేష్, సతీష్ కొత్తపేట వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలసి చదువుకున్నారు. రాజేష్ వానపల్లి మాలకొండయ్యనగర్ వద్ద చికెన్ వ్యాపారం చేసుకుంటుండగా, సతీష్ కులాంతర వివాహం చేసుకుని మందపల్లిలో నివసిస్తున్నాడు. కాగా సతీష్ శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ముమ్మిడివరం వెళ్తూ వానపల్లిలో రాజేష్ దుకాణం వద్ద ఆగాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా రాజేష్ తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిన విషయాన్ని చెప్పగా, సతీష్ తాను నచ్చచెప్పి తీసుకువస్తానని ఊరడించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడిని అనుమానించిన రాజేష్ చికెన్ కోసే కత్తితో సతీష్ మెడపై దాడి చేశాడు. పదునుగా ఉన్న కత్తి వేటుకు అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకు వెళ్లగా ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాల్సి ఉందని ఎస్సై సురేంద్ర తెలిపారు.