
పకడ్బందీగా మెగా పీటీఎం 2.0
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన నిర్వహించే మెగా పీటీఎం 2.0 (పేరెంట్స్ టీచర్స్ మీటింగ్)ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆదేశించారు. మెగా పీటీఎం అంశంపై శనివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మెగా పీటీఎం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,492 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ సమావేశం నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశాల్లో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న 2,54,310 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన మెగా పీటీఎం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్న భోజనం విద్యార్థిమిత్ర కిట్లు, విద్యార్థుల సామర్థ్యాల పురోగతి, విద్యార్థుల నమోదు, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.
గుర్తింపు లేని పాఠశాలలపై ప్రత్యేక ఫోకస్
జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా, ప్రభుత్వ నిబంధనలు అమలు చేయని పాఠశాలల పై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల కచ్చితంగా ప్రభుత్వ అనుమతి పొందాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల లిఖిత పూర్వక సమ్మతితోనే విలీన ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 492 పాఠశాలలను సర్దుబాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిపారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాలో కొత్తగా టీచర్లు నియమితులవుతారని చెప్పారు. తల్లికి వందనం పథకంలో నమోదైన అర్జీలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఐ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఇటీవల ఆయా యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలిచ్చామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి పాల్గొన్నారు.