
20 ఏళ్ల జైలు
చిత్తూరు లీగల్ : మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో రామకృష్ణ (65) అనే నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. 2020 జూలై 21న తొమ్మిదేళ్ల వయస్సున్న బాలికపై లైంగికదాడి జరిగిందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమల మండలం, చింతలవారిపల్లెకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తికి పెళ్లయ్యి పిల్లలున్నారు. ఇతను మద్యానికి బానిసయ్యి.. గ్రామంలో జులాయిగా తిరుగుతుండడంతో భార్య, పిల్లలు ఇతడిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఓ మైనర్ బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి, ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడని అభియోగాలు మోపిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పునిచ్చారు.
లీగల్ సెల్ సూపరింటెండెంట్పై క్రమశిక్షణా చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని లీగల్ సెల్ సూపరింటెండెంట్ షబ్బీర్బాషాపై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఆయనపై ఉన్న అభియోగాలకు సంబంధించి శుక్రవారం జీవో 688,689,690 లను ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం కలెక్టరేట్లో లీగల్ సెల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న షబ్బీర్బాషా అలియాస్ షబ్బాబాషా 2023లో జిల్లాలోని శ్రీరంగరాజపురం తహసీల్దార్గా పనిచేసేవారు. ఆయన 2023 మార్చి 21న ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించి ప్రెజెంటింగ్ ఆఫీసర్గా ఎల్.వెంకటనాయుడు (ఏసీబీ ఇన్స్పెక్టర్)ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏసీబీ కేసులో పట్టుబడ్డ షబ్బీర్ బాషాపై చార్జెస్ నమోదు చేయడంతో 10 రోజుల్లోపు లిఖిత పూర్వకంగా వివరణ సమర్పించాలని సూచించారు.
నకిలీ టోకెన్ల కలకలం
కార్వేటినగరం: ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీలో నకిలీ టోకెన్లు కలకలం రేపిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఓ హార్టికల్చర్ అధికారి ఏకంగా నకిలీ టోకెన్ల బుక్, ఫ్యాక్టరీ అధికారి సీలు తయారు చేశాడు. పోర్జరీ సంతకాలతో రైతులకు టోకెన్లు ఇచ్చి అటు రైతులను, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మోసగించాడు. వివరాలు.. మండల పరిధిలోని డీఎం పురం సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంటు వెంకటేష్ను ప్రభుత్వం మామిడి రైతులకు అందించే ప్రోత్సాహ సొమ్ము రూ.4ను నమోదు చేయడానికి ఏబీసీ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద విధులు కేటాయించింది. దురాశతో పుత్తూరులో ఓ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ టోకెన్లు, ఫ్యాక్టరీ అధికారి సీలు తయారీ చేయించాడు. ఆపై ఒక్కో టోకెన్ను రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు రైతులకు విక్రయించాడు. ఇలా మొత్తం 34 నకిలీ టోకెన్లను పోలీసులు గుర్తిం సీజ్ చేశారు.
ఇంతకీ ఎమిజరిగిందంటే
నకిలీ టోకెన్ల వల్ల యాజమాన్యం ఇచ్చిన టోకెన్ల కన్నా అధికంగా వాహనాలు రావడంతో పాటు, టోకెన్ల వరుస నంబర్లలో తేడా రావడంతో యాజమాన్యం నిఘా ఉంచింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ హనుమంతప్ప రంగప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది. హార్టికల్చర్ అధికారి వెంకటేష్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.