
రోడ్డున పడ్డ మామిడి!
● టన్నుల కొద్దీ రోడ్డుపైనే
● అయోమయంలో అన్నదాతలు
కాణిపాకం: మామిడి రోడ్డున పడింది. టన్నుల కొద్దీ తోతాపురి రోడ్డుకే అంకితమవుతోంది. ఫ్యాక్టరీలో అన్లోడింగ్ కష్టాలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 90శాతం కాయలు పక్వానికి వచ్చేశాయి. ఇకపై కోతలు ఇబ్బముబ్బడిగా ప్రారంభం కానున్నాయి. ఫ్యాక్టరీలు గుజ్జు తయారీ విషయంలో తప్పుడు లెక్కలు చూపించేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీనికితోడు విదేశాల్లో యుద్ధాలు ఫ్యాక్టరీలను భయపెడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 56 హెక్టార్ల మేర మామిడి పంట సాగవుతోంది. తద్వారా 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చని అధికారుల అంచనా. ఇందులో టేబుల్ రకాలు 16,105 హెక్టార్లకు గాను 1,45,960 మెట్రిక్ టన్నులు, తోతాపురి 39,895 హెక్టార్లకు 4.9 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుందని అధికారులు ముందస్తుగా అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్టు ఈసారి పంట దిగుబడి వచ్చింది. అయితే పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు విలవిల్లాడిపోతున్నారు.
గత ఏడాది నిల్వలతో..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 పళ్లగుజ్జు పరిశ్రమలున్నాయి. చిత్తూరు జిల్లాలో మాత్రం 35 ఫ్యాక్టరీలున్నాయి. వీటిలో 12 ఫ్యాక్టరీలు మామిడి గుజ్జు తయారీకి దూరమయ్యాయి. ఇందులో కొన్ని టమాటా వంటి వాటిని గుజ్జు చేసి అమ్ముకుంటున్నాయి. గత ఏడాది యూరఫ్ దేశాల్లో జరిగిన యుద్ధాల ప్రభావం వల్ల ఫ్రిబవరి వరకు 2.5 లక్షలక్ష టన్నుల గుజ్జు నిల్వలు పేరుకుపోయాయి. ఆ తర్వాత కొద్దికొద్దిగా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం 80 వేల టన్నుల వరకు నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఈ భయంతో ఫ్యాక్టరీలు మామిడిపై చిన్న చూపుచూస్తున్నాయి. ఈ ఏడాది అధికారులు బలవంతం చేయడంతో 23 ఫ్యాక్టరీలు తోతాపురి కాయలు కొనుగోలు చేస్తున్నాయి.
గుజ్జు తయారీ ఎక్కువ.. లెక్కలు తక్కువ
ఉమ్మడి జిల్లాలోని 43 ఫ్యాక్టరీలో 90 లైన్ (మామిడిగుజ్జు తయారీకి అవసరమైన యంత్రపరికరాలు)లు ఉన్నాయి. చిత్తూరులో జిల్లా విషయానికి వస్తే 35 పళ్లగుజ్జు పరిశ్రమలుంటే అందులో 60 లైన్లు ఉన్నాయి. వీటిలో 23 ఫ్యాక్టరీలకు గాను 54 లైన్లు పనిచేస్తున్నాయి. ఒక లైన్లో రోజుకూ 10 టన్నుల కాయల వరకు గుజ్జు తయారీ చేయొచ్చు. కానీ లైన్ క్లీనింగ్ కారణంగా 6 నుంచి 8 టన్నుల కాయల వరకు గుజ్జు చేస్తున్నాయి. ఇలా రోజువారీగా ఒక్కో ఫ్యాక్టరీ 200 నుంచి 250 టన్నుల కాయలను గుజ్జు తయారీ చేస్తున్నాయి. ఈ లెక్కన్న మొత్తం ఫ్యాక్టరీలు 10 వేల నుంచి 11వేల టన్నుల కాయల వరకు గుజ్జు తయారీకి వాడుతున్నాయి. తద్వారా గుజ్జు రూపంలో 5 నుంచి 6 టన్నులకు ఫ్యాకింగ్ అవుతున్నాయి. అయితే అధికారులు వద్ద ఉన్న లెక్కలకు, ఫ్యాక్టరీ నిర్వాహకులు చెప్పే లెక్కలకు పొంతన ఉండడం లేదు. తమిళనాడు నుంచి వస్తున్న కాయలకు ఫ్యాక్టరీలు ఈ లెక్కల్లోకి ఎక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిల్వలు, గుజ్జు తయారీని అధికంగా చూపించి తోతాపురి కొనుగోలును నిలుపుదల చేయాలని ఫ్యాక్టరీ నిర్వాహకులు సిద్ధమైనట్టు రైతులు చెబుతున్నారు.
యుద్ధాలతో మళ్లీ వణుకు
జిల్లాలో తయారైన పళ్లగుజ్జును గల్ఫ్, యూరఫ్ దేశాలకు అధికంగా ఎగుమతి చేస్తారు. అయితే ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధాలు, ఉక్రెన్–రష్యా యుద్ధాలు పళ్లగుజ్జు పరిశ్రమదారులను గడగడలాడిస్తున్నాయి. ఈ భయంతో మధ్యలో కూడా తోతాపురి గుజ్జును నిలుపుదల చేసే అవకాశాలున్నాయని పరిశ్రమదారుల చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో తోతాపురి అమ్మకాలు మూగబోయే అవకాశాలున్నాయి. తద్వారా 60శాతం పంట తోటలకు పరిమతం కానున్నట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాం
కాయలు తెచ్చి మూడు రోజులు అవుతా ఉండాది. ఈ మూడు రోజులు తిండీలేదు.. ఏమీలేదు. తిండి లేకపోయిన పర్వాలేదు. కాయలు దింపుకుంటే చాలు. కానీ ఇంత వరకు దింపుకోలేదు. ఈడ నుంచి ఆడ వరకు 800ట్రాక్టర్లు బారులు తీరాయి. ఇంకో రోజు ఉంటే బండిలో ఉండే కాయలు దేనికీ పనికి రావు. ఈసారి నిండా మునిగిపోయాం. మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి స్వామీ. – సుందరయ్య, చిత్తూరు మండలం
దమ్మిడీకి పనికిరావ్
మూడు రోజులు, నాలుగు రోజులు ట్రాక్టర్లోనే కాయలుంటే ఎందుకూ పనికిరావు. ఫ్యాక్టరీకి పనికి రావు. రోడ్డు మీద పారేసి రావాల్సిందే. ఫ్యాక్టరీ వద్ద అవస్థలు పడుతున్నాం. బండికి రాత్రంతా కాపాల కాస్తున్నాం. ఇలా అయితే రైతులు ఏమైపోవాలి. ఫ్యాక్టరీ వాళ్లు మాత్రం వాళ్ల సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో పక్క యుద్ధాలు అని చెబుతున్నారు. దాని వల్ల మాకు నష్టమే అంటున్నారు. – కిరణ్కుమార్, పెనుమూరు
41,005 టన్నులు మాత్రమే ఫ్యాక్టరీకి
ఈ నెల 6వ తేదీ నుంచి కాయలు కొనుగోలు చేయగా.. అధికారుల వద్ద 8వ తేదీ నుంచి కాయలు కొనుగోలు వివరాలున్నాయి. ఫ్యాక్టరీ నిర్వాహకులు 12 వేలకు పైగా టోకన్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే 5,993 మంది రైతులు 41,005 టన్నుల కాయలు ఫ్యాక్టరీలకు చేరినట్లు వారి వద్ద గణాంకాలున్నాయి. రోడ్డుపైనే గత మూడు రోజులుగా 80 వేల టన్నుల వరకు ట్రాక్టర్లల్లోనే మూలుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. జీడీ నెల్లూరు మండలం ఎట్టేరిలోని ఫ్యాక్టరీ వద్ద 800 ట్రాక్టర్లు బారులు తీరగా.. 4వేల టన్నుల కాయలు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి. గుడిపాలలోని పానటూరు వద్ద ఉన్న మ్యాంగో ఫ్యాక్టరీ వద్ద 650పైగా ట్రాక్టర్లు, లారీలు క్యూకట్టాయి. ఇందులో 3,800 టన్నుల మేర ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. అలాగే గుడిపాల మండలంలోని కొత్తపల్లి సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద 850 ట్రాక్టర్లు, లారీల్లో 5 వేల టన్నుల కాయలు రోడ్డుపైనే కాపలాకాస్తున్నాయి. మరిన్ని ఫ్యాక్టరీల వద్ద కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

రోడ్డున పడ్డ మామిడి!

రోడ్డున పడ్డ మామిడి!

రోడ్డున పడ్డ మామిడి!