బండి దొరక్క బేజారు! | - | Sakshi
Sakshi News home page

బండి దొరక్క బేజారు!

Jun 21 2025 3:11 AM | Updated on Jun 21 2025 3:11 AM

బండి

బండి దొరక్క బేజారు!

జిల్లాలో ట్రాక్టర్లకు భలే డిమాండ్‌

మామిడికాయల ఎఫెక్ట్‌తో ట్రాక్టర్ల కొరత

మామిడి కాయల తరలింపునకు రాని లారీలు

కాణిపాకం: మామిడి రైతులు ఆలస్యంగా వచ్చిన పూతతో పులకరించిపోయారు. కాయలొచ్చాక మీసం తిప్పారు. కోత కొచ్చాక కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాయలు అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. టోకన్ల కోసం తొక్కిసలాట, తోపులాటలో నలిగిపోయారు. టోకన్లు చేతికొచ్చాక కోత కోసి తీసుకెళితే ఫ్యాక్టరీ వద్ద పడిగావులు కాస్తున్నాయి. ట్రాక్టర్‌ చార్జీలు, వెయిటింగ్‌ చార్జీలు, డ్రైవర్‌ కూలీలు పట్టిపీడిస్తున్నాయి. దీనికితోడు లారీలు మామిడి కాయల తరలింపునకు పంపలేమంటూ ఓనర్లు మొండికేస్తున్నారు. దీంతో ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరిగింది.

నిరీక్షిస్తూ.. నీరసిస్తూ!

జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి వేగంగా మామిడి కోతలు ప్రారంభయ్యాయి. అష్టకష్టాలు పడి టోకన్లు సంపాధించిన రైతులు వారికి ఇచ్చిన తేదీ ప్రకారం కాయలు కోసి ట్రాక్టర్లలో ఫ్యాక్టరీలకు తీసుకెళుతున్నారు. అయితే అక్కడ రైతులు అనుభవిస్తున్న కష్టాలు అన్నీఇన్నీకావు. కాయలు అన్‌లోడింగ్‌కు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఫ్యాక్టరీల్లో సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వడంతో సామాన్య రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో ఫ్యాక్టరీ వద్ద 200 నుంచి 800 ట్రాక్టర్లు నిరీక్షిస్తున్నాయి.

ఒక్కలోడయ్యా..రావయ్యా!

ట్రాక్టర్లన్నీ కూడా ఫ్యాక్టరీల వద్దే నిలబడి పోయాయి. రోజులు తరబడి అక్కడే ఉండిపోతున్నాయి. ముందుకు..వెనక్కు వెళ్లడం తప్ప ఫ్యాక్టరీలో కాయలు దింపాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. ట్రాక్టర్‌ యజమానులకు వారి..వారి గిరాకీలే సరిపోతున్నాయి. కొంతమంది సొంత పంటను తరలించుకునేందుకు పరిమితం చేశారు. మిగిలిన ట్రాక్టర్లు బాడుగలకు పంపుతున్నారు. ఈ బండ్లు చాలక రైతులు అల్లాడి పోతున్నారు. ఫ్యాక్టరీలో లోడ్‌ దింపిన బండ్లు అట్టే బుక్‌ అవుతున్నాయి. చాలా మంది రైతులు టోకన్లు ఉన్నా ట్రాక్టర్లు దోరకక కోతలు కోయలేకపోతున్నారు. ఒక్క లోడే రండి అని బతిమిలాడుకున్నా ట్రాక్టర్ల యజమానులు ఖాతరు చేయడం లేదు.

తడిసిమోపుడవుతున్న ట్రాక్టర్‌ బాడుగలు

ఈసారి మామిడి రైతులకు దిగుబడి బాగున్నా...అందుకు తగ్గ ప్రతిఫలం లేదు. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోగా..చేతిలోని పైసలు ఖాళీ అవుతున్నాయి. కోత కూలీలు రైతులకు చెమటలు పట్టిస్తున్నాయి. దీనికితోడు ట్రాక్టర్‌ బాడుగలు భారమయ్యాయి. కి.మీను బట్టి రూ.1000 నుంచి రూ.2000 వరకు ట్రాక్టర్‌ బాడుగలు అడుగుతున్నారు. మళ్లీ వెయిటింగ్‌ చార్జీ రోజుకు రూ.500 నుంచి రూ.1000 ఫిక్స్‌ చేస్తున్నారు. డ్రైవర్‌ కూలీ రూ.500, కొంత మంది డ్రైవర్లకు రాత్రి అయితే లిక్కర్‌ బాటిల్‌ కూడా ఇవ్వాల్సి ఉంది.

లారీలు రావు

మామిడి తరలింపునకు లారీలు రానంటూ మొండికేస్తున్నాయి. జిల్లా రవాణా శాఖ అధికారులు లారీ యజమానులతో మాట్లాడినా ఫలితం లేకపోతోంది. కాయలకు వెళితే లారీలకు గిట్టబాటు కాదని సమాచారం. అలాగే తమిళనాడు లారీలను కూడా జిల్లాలోకి అనుమతించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్టర్లను సమకూర్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ట్రాక్టర్‌ దొరకడం లేదు

ట్రాక్టర్‌ కోసం రెండు రోజులుగా తిరుగుతున్నా. ట్రాక్టర్లు దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను శనివారానికి ఫ్యాక్టరీకి తోలేలా టోకన్‌ ఇచ్చారు. ఇప్పుడు టోకన్‌ ఉంది కానీ ట్రాక్టర్‌ దొరకడం లేదు. కోతకోయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను.

– బాలాజీ, అనుపల్లి, చిత్తూరు

బండి దొరక్క బేజారు!1
1/1

బండి దొరక్క బేజారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement