
అయ్యోర్లపై కక్ష సాధింపు
చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో ఎస్జీటీలు బదిలీల బాధలతో నష్టపోతున్నారు. గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లా కేంద్రంలోని షర్మన్ బాలికోన్నత పాఠశాలలో ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు పలు సమస్యలు ఎస్జీటీ టీచర్లను వేధిస్తున్నాయి. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో టీచర్లపై ఉన్నతాధికారులు, రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారులు కక్ష సాధింపు ధోరణితో అన్యాయం చేస్తున్నారని బాధిత టీచర్లు వాపోతున్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేసేలా ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరుకానివ్వకుండా కౌన్సెలింగ్ కేంద్రం నుంచి భయాందోళనలు సృష్టించి తరిమేశారు. ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో స్పౌజ్ పాయింట్ల విషయంలో విద్యాశాఖ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఎస్జీటీ టీచర్లు వాపోతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్న టీచర్ల పై చులకన భావనతో జిల్లా విద్యాశాఖ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు రెండు గంటలపాటు ధర్నా
స్పౌజ్ విషయంలో జీవో నెంబర్ 22 కు వ్యతిరేకంగా బదిలీలు నిర్వహిస్తూ అన్యాయం చేస్తుండడంతో బాధిత టీచర్లు గురువారం కౌన్సెలింగ్ను బహిష్కరించి కేంద్రంలో ధర్నా నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మ్యాన్యువల్ విధానంలో బదిలీలు నిర్వహించాలని చెప్పినందుకు విద్యాశాఖ అధికారులు కక్ష సాధింపులకు పాల్పడి అన్యాయం చేస్తున్నారని పలువురు బాధిత ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. బదిలీల నిర్వహణకు రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారిని అబ్జర్వర్ గా నియమించాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
సీఎం జిల్లాలో బదిలీల బాధలు
కౌన్సెలింగ్ కేంద్రంలో ధర్నా
జీవోకు వ్యతిరేకంగా బదిలీలు
ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా చిత్తూరు విద్యాశాఖ అధికారులు బదిలీలు నిర్వహిస్తున్నారు. జీవో ప్రకారం స్పౌజ్ నమోదు చేసుకున్న టీచర్లు జిల్లాలో ఎక్కడైనా బదిలీ కోరుకునే అవకాశం ఉంది. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రస్తుతం పనిచేస్తున్న మండలంలోనే కోరుకోవాలని విద్యాశాఖ అధికారులు చెప్పడం అన్యాయం. ఎప్పుడూ ఒకే మండలంలో విధులు నిర్వహించాలా?. గతంలో ఎప్పుడూ ఇలాంటి అవకతవకల బదిలీలు జరగలేదు. కొత్త మండలాలకు వెళ్లాలని నిరీక్షించాం. కానీ ఫలితం లేకుండా పోతోంది.
– దీపిక, ఎస్జీటీ ఉపాధ్యాయురాలు