
విలీనం మా కొద్దు
బైరెడ్డిపల్లె: తమ గ్రామంలో ఉన్న పాఠశాల విద్యార్థులను విలీనం చేస్తూ పక్క గ్రామానికి తరలించడం స మంజసం కాదని మండలంలోని మూగనపల్లె గ్రామస్తులు గురువారం పాఠశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో సుమారు 30 మంది విద్యార్థులు 3, 4, 5 తరగతులు చదువుతున్నారన్నారు. విద్యార్థుల శాతం తక్కువగా ఉందని సుమారు 1.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచుకుప్పం పాఠశాలకు విలీనం చేస్తూ విద్యార్థులను తరలించడం భావ్యం కాదన్నారు. ఉదయం, సాయంత్రం పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు ప్రమాదాలు సంభవించడం ఖాయమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి విలీనాన్ని రద్దు చేయాలని కోరారు.
ఆందోళనలు ఉధృతం చేస్తాం
కుప్పంరూరల్: ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేసే కార్యక్రమంలో భాగంగా కుప్పం మండలం, బలమందకొట్టం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను రద్దు చేసి విలీనం చేస్తారనే సమాచారంతో గురువారం స్థానికులు ఆందోళనకు దిగారు. తరగతులు తొలగిస్తే పిల్లలు బైరప్పకొటాలుకు వెళ్లి రావాల్సి ఉంటుందని, అంతదూరం వెళ్లిరావడం కష్టతరమని వాపోయారు. విదాయశాఖ అధికారులు స్పందించి వెంటనే వినీనాన్ని రద్దు చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.