
క్వారీ.. ఆక్రమణల సవారీ!
● మాదిగబండ క్వారీని ఆక్రమించిన టీడీపీ నేత! ● హైకోర్టులో కేసు నడుస్తున్నా బేఖాతర్ ● లీజుదారుని కాదని తానే పనులు చేపడుతున్న వైనం ● విచ్చలవిడిగా సాగుతున్న బ్లాస్టింగ్లు, జల్లి అమ్మకాలు ● పట్టించుకోని మైనింగ్ అధికారులు
పలమనేరు: అధికారంలో ఉంటే చాలు చట్టాలు, కోర్టులను పట్టించుకోకుండా అక్రమాలకు దిగడం కూటమి నేతలకు కొత్తమీ కాదు. మొన్నటి దాకా మిన్నకుండి కర్ణాటకలో బీజేపీ నేతగా, ఇక్కడ టీడీపీ నేతగా చెలామని అవుతున్న ఓ నేత కూటమి అధికార బలం, మైనింగ్ అధికారుల అండతో అక్రమంగా క్వారీని స్వాధీనం చేసుకుని యథేచ్ఛగా స్టోన్ క్రషింగ్ పనులు చేపడుతున్నాడు. అసలైన లీజుదారులు హైకోర్టులో రిట్ఫిటిషన్ దాఖలు చేసి కేసు పెండింగ్లో ఉండగా క్వారీని ఆక్రమించుకొని పనులు చేసుకుంటున్న వ్యవహారం పలమనేరు మండలం, కొలమాసనపల్లి పంచాయతీ, మాదిగబండ వద్ద శుక్రవారం వెలుగు చూసింది. అసలైన లీజుదారుడు శరత్కుమార్ కథనం మేరకు..
మాదిగబండ క్వారీలో సర్వే నం.1375/3, 1376/4లో 1.170 హెక్టార్లలో రోడ్మెటల్, బిల్డింగ్ స్టోన్ లీజుదారుగా 2021 నుంచి జీ.మోహన్బాబు క్వారీ లీజుదారుగా ఉండేవారు. దీన్ని ఆయన వీ.కోట మండలం, కుంబార్లపల్లికి చెందిన శరత్కుమార్కు 22–10–2021న బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి స్థానిక మైనింగ్ శాఖలో అప్పటి ఏడీ వేణుగోపాల్ ప్రోసీడింగ్స్ నం.1059/టీక్యూఎల్/ఆర్ఎంబీఎస్/21 గా ఇచ్చారు. శరత్కుమార్ క్వారీకి సంబంధించి హెచ్టీ సర్వీస్ నం.2503 పేరిట తీసుకున్నాడు. ఇలా ఉండగా ఇదే క్వారీ ఇన్ ఎలిజిబుల్ జాబితాలో ఉందంటూ 2024 నవంబర్ 8న అప్పటి పలమనేరు మైనింగ్ ఏడీ లీజుదారుడైన శరత్కుమార్కు ప్రొసీడింగ్స్ నం.1059 మేర షోకాజ్ నోటీసు జారీచేసింది. దీంతో లీజుదారుడు పనులు ఆపేశాడు. అంతకుముందే 2024 జూన్ 6న స్థానిక ట్రాన్స్కో అధికారులకు అప్పటిదాకా ఉన్న బకాయిలను చెల్లించి సర్వీసును డీసీ చేయమని ట్రాన్స్కో ఎస్ఈ(ఆపరేషన్)కు అర్జీ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్థానిక మైనింగ్ అధికారులకు తెలిపారు.
కూటమి అధికారంలోకి రాగానే..
ఇదిలావుండగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్ణాటక, ఏపీ పాలిటిక్స్లో డబుల్రోల్ పోషిస్తున్న జనార్దన్నాయుడు అనే వ్యక్తి అక్రమంగా తన రౌడీలతో వచ్చి మాదిగబండ క్వారీని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడున్న జల్లిని సైతం కర్ణాటకకు తరలించుకుపోయాడు. దీనిపై లీజుదారుడైన శరత్కుమార్ అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినా పట్టించు కోలేదు. కలెక్టర్ ఆదేశాలతో అప్పటి తహసీల్దార్ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఆ క్వారీకి లీజుదారుడు శరత్కుమారేనని, జనార్ధన్ నాయుడు ఆక్రమించుకొంది నిజమేనని నివేదిక పంపారు. కానీ బాధితునికి న్యాయం జరగ లేదు. ఇదే అదునుగా సదరు నేత క్వారీని ఆక్రమించుకుని యథేచ్ఛగా స్టోన్ క్రషింగ్ పనులు చేపట్టాడు. దీంతో బాధితుడు శరత్కుమార్ హైకోర్టులో గత ఏడాది సెప్టెంబర్ 3న రిట్పిటిషన్ ఫైల్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో నడుస్తోంది.
అధికార బలంతో మళ్లీ పనులు
క్వారీని పరిశీలించి చర్యలు తీసుకుంటాం
మాదిగబండ క్వారీలో అక్రమంగా పనులు జరుగుతున్న విషయం నా దృష్టికి రాలేదు. ఈ క్వారీకి సంబంధించిన కేసు హైకోర్టులో ఉందనే విషయం తెలియదు. సంబంధిత క్వారీ ఫైల్ చూసి సోమవారం నేనే స్వయంగా వెళ్లి అక్కడి క్వారీని పరిశీలిస్తా. అనుమతులు లేకుండా, లీజుదారుగాని వ్యక్తులు అక్కడ పనులు చేస్తుంటే చర్యలు తప్పవు.
– సత్యనారాయణ, మైనింగ్ ఏడీ, పలమనేరు
మొన్నటిదాకా స్తబ్ధంగా ఉన్న ఆక్రమణదారుడు తనకున్న పలుకుబడితో ఆక్రమించుకున్న క్వారీలో పనులు మొదలు పెట్టాడు. ప్రస్తుతం కొందరు రౌడీలను అక్కడ ఉంచుకొని తమిళనాడు కూలీల ద్వారా బ్లాస్టింగ్ చేసి రోజుకు 500 టన్నుల దాకా గ్రావెల్ను విక్రయిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అక్కడ హిటాచీలు, టిప్పర్లు దర్శనమిస్తున్నాయి. లీజుదారుగా ఉన్న శరత్కుమార్కున్న లీజు గడువు ముగియడంతో తాము రెన్యూవల్ కోసం షోకాజ్ నోటీసులను పంపామని ఆయన రెస్పాండ్ కాలేదని, అక్కడ ఇతర వ్యక్తుల ఆక్రమణలు లేవని గతంలో ఉన్న పలమనేరు మైనింగ్ఏడీ బాలసుబ్రమణ్యం హైకోర్టుకు తన కౌంటర్లో తెలిపారు.

క్వారీ.. ఆక్రమణల సవారీ!

క్వారీ.. ఆక్రమణల సవారీ!