
కన్నమేసి.. కాజేశాడా?
● చిత్తూరులో బంగారు నగల చోరీ ఘటనలో పురోగతి ● సరిహద్దు ప్రాంతానికి చెందిన నిందితుడి పనేని నిర్ధారణ
చిత్తూరు అర్బన్: ఎంత పెద్ద భవనమైనా.. దాని టాప్లో కన్నం వేసి చోరీ చేయడంలో దిట్ట. తమిళనాడు–కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి చెందిన నిందితుడే.. చిత్తూరులోని బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి పాల్పడ్డట్లు పోలీసులకు క్లూ లభించింది. బుధవారం అర్ధరాత్రి చిత్తూరులోని ఓ బంగారు దుకాణం, మరో స్టీల్ సామాన్లు విక్రయించే దుకాణంలోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తి .. 180 గ్రాముల బంగారు ఆభరణాలు, అయిదున్నర కిలోల వెండి వస్తువులు, రూ.3 లక్షలకు పైగా నగదు చోరీ చేశాడు. కేసును విచారిస్తున్న పోలీసులు.. చోరికి పాల్పడింది ఒకే ఒక్కడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితుడిపై గతంలో పలు స్టేషన్లలో పదికి పైగా చోరీ కేసులు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడిస్తే, అతను పారిపోయే ప్రమాదం ఉండడంతో ఆ వివరాలను దాచి ఉంచారు. ఇప్పటికే నిందితుడిని పట్టుకోవడానికి మూడు బృందాలు గాలిస్తున్నాయి.