
విత్తన పంపిణీ ప్రారంభం
● తొలిరోజు 5220 రైతులు రిజిస్ట్రేషన్ ● బ్యాగుకు కొన్నిచోట్ల రూ.1,700 వసూలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో వేరుశనగ విత్తన పంపిణీ రిజిస్ట్రేషన్ బుధవారం నుంచి ప్రారంభమైంది. అరకొర విత్తనాల రాకతో వ్యవసాయశాఖ అధికారులు ఎలా పంపిణీ చేయాలో తెలియక తికమకపడుతున్నారు. కూటమి నేతల ముందస్తు ఆర్డర్లతో రైతులకు ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నేను లీడర్....నేను చెప్పిన వాళ్లకే కాయలు ఇవ్వాలని ప్రతి పంచాయతీ నుంచి పది నుంచి ఇరవై మంది అధికారులను వేధిస్తున్నారు. పొలం లేకున్నా విత్తనం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో మండల అధికారులు, సిబ్బంది వణికిపోతున్నారు. తొలి రోజు ప్రక్రియ నత్తనడకన సాగింది. మరోవైపు ఎమ్మెల్యేల నుంచి ముహూర్తం ఖరారు కాకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అడ్డంకులు పడ్డాయి. ఎమ్మెల్యేల ప్రారంభోత్సవం తర్వాతే విత్తన కాయల రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని చాలా చోట్ల మెలిక పెట్టారు. ఇక కొన్ని మండలాల్లో ఆ అరకొర కాయలు వద్దని, ఇస్తే గొడవలు వస్తాయని నిలుపుదల చేశారు. దీంతో విత్తన పంపిణీ ప్రక్రియ గురువారం కూడా జోరుగా సాగేటట్లు కనిపించడం లేదు. కొన్ని చోట్ల మాత్రం లోలోపల రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వేరుశనగ విత్తన బ్యాగు (కే–6రకం..30 కేజీలు) రూ.1674 కాగా..కొన్ని చోట్ల రూ.1700 వసూలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. చిల్లర పేరుతో ఇలా దోపిడీ చేయడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. కాగా 1881 క్వింటాళ్లకు...5220 మంది రైతులు రిజిస్ట్రేషన్ అయ్యారని అధికారులు చెబుతున్నారు.