
ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇంటింటి చెత్త సేకరణ 100 శాతం చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సచివాలయ పరిధిలో చెత్త సేకరణ పై శానిటరీ ఇన్స్పెక్టర్ల సంతకంతో నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రదేశాల గోడలపై పోస్టర్లను అతికించకూడదని చెప్పారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉన్న పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని ఏరియా ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలించాలన్నారు. వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మరమ్మతులకు గురైన వీధి దీపాలను సరిచేయాలన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, తాగునీటిని క్లోరినేషన్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. సమావేశంలో పలువురు కమిషనర్లు పాల్గొన్నారు.
పీఎం సూర్యఘర్ పై ప్రచారం
జిల్లాలోని ప్రజలందరికీ పీఎం సూర్యఘర్ యోజన పథకం ఉపయోగాలను తెలిసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడం పై మరింత అవగాహన కల్పించాలన్నారు. మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సంఘాల్లో మహిళలకు సీ్త్ర నిధి, ఉన్నతి, బ్యాంక్లతో రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రాన్స్ కో ఎస్ఈ ఇస్మాయిల్, నెడ్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ గయాజ్, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.