
ఆర్డీఎస్ఎస్ పనులపై అసంతృప్తి
● ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పనులపై నిర్లక్ష్యం ఎందుకని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో నిర్మాణ, ఎంఆర్టీ విభాగాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకు త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వాలని ఉద్దేశంతో ఆర్డీఎస్ఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో పనితీరు మందగమనంలో ఉందన్నారు. అసలే పని జరుగుతుందా..? అనే సందేహాం వస్తోందన్నారు. ఇకనైన పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటే సకాలంలో వాటిని బాగు చేసి పంపాలని ఆదేశించారు. ఎస్పీఎంల చుట్టూ తిప్పించుకుంటూ రైతులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. పాడైన ట్రాన్స్ఫార్మర్ రవాణా ఉచితంగా చేయాలన్నారు. జిల్లాకు 15వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్స్ ఇవ్వాలని లక్ష్యంగా ఇచ్చారన్నారు. ప్రతి ఏఈ సెక్షన్ పరిధిలో నెలకు 300 యూనిట్లు వాడుతున్న 10 మంది వినియోగదారులను కలవాలన్నారు. బీసీలకు అదనంగా రూ.20 వేలు ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ జగదీష్, నిర్మాణ, ఎంఆర్టీ విభాగాల ఈఈలు అమర్బాబు, బాబు, ఏఓ ప్రసన్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.