
విత్తనంపై పెత్తనం
● టోకెన్లు ఇవ్వాలని కూటమి నేతల హుకుం జారీ ● జిల్లాకు అరకొరగా వేరుశనగ విత్తన కాయలు ● నేటి నుంచి రిజిస్ట్రేషన్లు, పంపిణీ ప్రారంభం ● ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీకి శ్రీకారం ● నిజమైన రైతులకు మొండిచేయి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో నేటి నుంచి వేరుశనగ విత్తన పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. విత్తన పంపిణీలో కూటమి పెత్తనం అలుముకుంది. ప్రారంభానికి ముందే టోకెన్ల గోల మొదలైంది. కూటమి నేతలు టోకెన్లు తమ చేతిలో పెట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో నిజమైన రైతులకు వేరుశనగ కాయలు అందని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు కొన్ని చోట్ల కూటమి నేతలు, ఎమ్మెల్యే అరకొర విత్తనాలు మాకొద్దని తిరస్కరించారని అధికార వర్గాలు కోడైకూస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో వర్షాధార పంటగా వేరుశనగ పంటను సాగు చేస్తారు. ఈసారి సాధారణ విస్తీర్ణం 35,228 హెక్టార్లు ఉండగా...90 వేల మంది రైతులు వేరుశనగ సాగు చేస్తారని అధికారుల అంచనా. ఇందుకు గాను ప్రభుత్వం జిల్లాకు 25,643 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం కేటాయించింది. ఏటా రైతులకు అవసరమైనంత మేర..అంటే 40 వేల క్వింటాళ్ల మేర సరఫరా అయ్యేది. ఈ సారి చాలీచాలినంత విత్తనాలు సరఫరా చేసి ప్రభుత్వం ఖరీఫ్ రైతుల కాడికి సంకెళ్లు వేసింది.
రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ
జిల్లా వ్యాప్తంగా వేరుశనగ విత్తన పంపిణీకి సంబంధించి బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల చేతుల మీదుగా కాయలు పంపిణీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పది మంది రైతులకు కాయలు పంపిణీ చేయనున్నారు. రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఈనెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేలు కాయలు పంపిణీ చేసే క్రమంలో ఎక్కడా గొడవలు ఉండకూడదని..ఇలా ప్లాన్ చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కొన్నిచోట్ల అరకొర విత్తనాల తిరస్కరణ?
అరకొరగా వచ్చిన వేరుశనగ విత్తనాలు మాకొద్దంటూ కొన్నిచోట్ల కూటమి నేతలు, ఎమ్మెల్యేలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. అరకొరగా ఇస్తే మా పరువు పోతుందని అధికారులకు నివేదించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాయలు ఇస్తే ఇవ్వండి...లేకుంటే వద్దని చెప్పినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వైపు వారి వద్ద కాయలు పంపిణీకి, పంట సాగుకు పొంతన లేదంటూ అధికారులు వాదిస్తున్నారు. చాలా మంది కాయలను వంటనూనె కోసం తీసుకుంటున్నారని జవాబు ఇస్తున్నారు. ఈసారి కాయలు తీసుకునే వ్యక్తులు విత్తు వేసేలా చూస్తామని, లేనిపక్షంలో అన్నదాత సుఖీభవలో కోత పెడతామని గట్టిగా ప్రచారం చేయిస్తున్నారు.
అయోమయంలో అధికారులు
ఈసారి వర్షాలు బాగానే కురుస్తున్నాయి. అధిక వర్షపాతం ఉందని వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. వేరుశనగ పంటను విస్తరంగా పండించాలని చూస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టు కూటమి ప్రభుత్వం వేరుశనగ విత్తన కేటాయింపు చేయలేదు. ఇక వచ్చిన కాయలను కూటమి నేతలు ముందస్తుగానే ఆర్డర్లు పెట్టుకున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు ఒక్కో సచివాలయానికి 200 నుంచి 260 బ్యాగుల వరకు పంచి పెట్టారు. గతంలో ఒక్కో సచివాలయానికి 400 నుంచి 500 బ్యాగుల వరకు కాయలు ఇచ్చారు. ఈసారి అరకొరగా కాయలు రావడంతో క్షేత్ర స్థాయి సిబ్బంది అయోమయంలో పడ్డారు. ఈ తరుణంలో స్థానిక కూటమి నేతలు 100 నుంచి 150 బ్యాగుల వరకు టోకెన్లు ముందుగానే తమ చేతిల్లో పెట్టాలని హుకుం జారీ చేశారు. కొన్ని చోట్ల అప్పుడే కూటమి నేతలకు ఆర్డర్లు బుక్కయ్యాయి. సిబ్బంది భయపడి నేతల చేతికి టోకెన్లు ఇచ్చేశారని సమాచారం. కొన్ని చోట్ల మండల స్థాయి అధికారులు నేతలకు కొమ్ముకాస్తున్నారు. దీంతో కాయలు నిజమైన రైతులకు అందేలా కనిపించడం లేదు.