
షేర్ల ధరల భారీ ర్యాలీ
చైనాయేతర తయారీ ఎఫెక్ట్
పటిష్ట డిమాండ్తో మరింత స్పీడ్
ఈఎంఎస్లో అధిక వృద్ధికి అవకాశాలు
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సరీ్వసెస్ (ఈఎంఎస్) రంగం దుమ్మురేపుతోంది. వ్యవస్థాగత వృద్ధికి పలు అంశాలు తోడవడంతో ఈ రంగంలోని కంపెనీలు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. చైనాయేతర తయారీ తదితర అంశాలతో ఏర్పడుతున్న డిమాండ్ ఈ రంగానికి బలాన్నిస్తోంది. దీంతో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లో హవా చూపుతున్న ఈఎంఎస్ దిగ్గజాలు మరింత స్పీడందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మేకిన్ ఇండియాతో తయారీకి దన్నుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, చైనాయేతర దేశాలలో తయారీ యూనిట్ల ఏర్పాటుపై గ్లోబల్ దిగ్గజాల దృష్టి దేశీయంగా ఈఎంఎస్ కంపెనీలకు జోష్నిస్తోంది. దీనికితోడు కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇండ్రస్టియల్, ఎనర్జీ, డిఫెన్స్, మెడికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల నుంచి పటిష్ట డిమాండ్ వీటికి జత కలుస్తోంది.
వెరసి ఈఎంఎస్ రంగంలోని పలు లిస్టెడ్ కంపెనీలు కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటు దేశీ డిమాండుకుతోడు అటు ఎగుమతులు సైతం పుంజుకోవడం కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. నిజానికి ఈ రంగంలో మార్జిన్లు తక్కువకావడంతో అధిక అమ్మకాల పరిమాణమే కంపెనీలకు లబ్ధిని చేకూరుస్తుంది. అయినప్పటికీ కొద్ది నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తోంది.
భారీ అంచనాలు
దేశీయంగా ఈఎంఎస్ రంగం 2022–23 నుంచి 2027–28 కాలంలో వార్షికంగా 25 శాతం వృద్ధి సాధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 2027–28కల్లా రూ. 27.7 లక్షల కోట్లను తాకగలదని అంచనా వేశాయి. ఈ రంగం విలువ 2022లో రూ. 8.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం వేసిన అంచనాలివి. కాగా.. ప్రభుత్వం స్థానిక తయారీకి దన్నునిస్తూ ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతోంది.
తద్వారా గ్లోబల్ దిగ్గజాలను దేశీయంగా తయారీకి ఆహ్వానిస్తోంది. దేశీయంగా పటిష్టస్థాయిలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలు అందుబాటులో ఉండటానికితోడు.. నైపుణ్యంగల మానవవనరులు చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా ఈఎంఎస్ రంగానికి భారత్ భారీ మార్కెట్ కూడా. అధిక శాతం కంపెనీలు బీటూబీ కస్టమర్లపైనే దృష్టిపెడుతున్నాయి.
కీలక రంగాల దన్ను
అధిక మార్జిన్లకు వీలున్న ఏరోస్పేస్, ఇండ్రస్టియల్స్, ఆటోమోటివ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆర్డర్లు లభిస్తుండటంతో లిస్టెడ్ కంపెనీల లాభదాయకత మెరుగుపడుతోంది. ఇందుకు దేశీ కంపెనీలు సంక్లిష్ట ప్రొడక్టుల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దేశీయంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విస్తృతి తక్కువగా ఉండటం, వినియోగంపై వెచి్చంచగల ఆదాయాలు పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి.
తయారీలో స్థానికతకు ప్రాధాన్యత, అధిక విలువగల ప్రొడక్టుల తయారీలో నైపుణ్యం వంటి అంశాలతో లిస్టెడ్ దిగ్గజాలు దేశీయంగా ఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో పోటీపడే తయారీ కేంద్రంగా భారత్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలపడుతున్న ఆర్డర్ల బుక్ లిస్టెడ్ దిగ్గజాలకు బూస్ట్నిస్తోంది.
దిగ్గజాల దూకుడు
దేశీ లిస్టెడ్ దిగ్గజాలలో డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అవలాన్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జీఎస్, సైయెంట్ డీఎల్ఎం, డేటా ప్యాటర్న్స్ ఇండియా తదితరాలున్నాయి. వీటిలో డిక్సన్, అంబర్ను మినహాయిస్తే మొత్తం ఆర్డర్ బుక్ విలువ గతేడాదికల్లా(2024–25) వార్షికంగా 23 శాతం పురోభివృద్ధిని సాధించింది. రూ. 16,300 కోట్లకు చేరింది. ఇక గతేడాది లిస్టెడ్ దిగ్గజాల మొత్తం ఆదాయం వార్షికంగా 84 శాతం జంప్చేసి రూ. 58,600 కోట్లను తాకింది. ఆదాయంలో డిక్సన్ 2 రెట్లు దూసుకెళ్లగా.. కేన్స్ 51 శాతం, అంబర్ 48 శాతం చొప్పున జంప్చేశాయి. ఇతర సంస్థల ఆదాయం సగటున 20 శాతానికిపైగా ఎగసింది. మొత్తం నిర్వహణ లాభం 73 శాతం పురోగమించి రూ. 3,500 కోట్లను తాకింది.
– సాక్షి, బిజినెస్ డెస్క్