11 ఏళ్లుగా పాత వేతనాలే...
ఒప్పందానికి తూట్లు
● సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన ● డీఏ మాత్రమే పెంచుతూ కాలం గడుపుతున్న యాజమాన్యం
రుద్రంపూర్: సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు 11 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు. అప్పుడు ఏ వేతనంతోనైతే విధుల్లో చేరారో ఇప్పటికీ అదే వేతనం పొందుతున్నారు. ఆరు నెలలకోసారి కేవలం కరువుభత్యం (డీఏ) పెంచుతూ సింగరేణి యాజమాన్యంతో పాటు గత, ప్రస్తుత ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై లేబర్ కోర్టును ఆశ్రయించినా వేతనం పెంపు కొలిక్కి రాకపోవడం గమనార్హం.
ఆ వేతనాలతోనే సరి
కాంట్రాక్టు కార్మికులకు 11 ఏళ్ల కిందట నిర్ణయించిన వేతనాలే నేటికీ అమలవుతున్నాయి. స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.760, సెమీ స్కిల్డ్ వారికి రూ.632, అన్స్కిల్డ్ వారికై తే రూ.541గా వేతనం నిర్ణయించారు. ఇందులో సీఎంపీఎఫ్ రికవరీగా 12 శాతం కోత విధిస్తారు. సింగరేణిలో 2001 నుంచి ఔట్సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికుల నియామకాలు మొదలయ్యాయి. నాడు నాలుగు విభాగాల్లో 100 మందితో పనులు ప్రారంభించిన సంస్థ.. ఒక్క పర్మనెంట్ కార్మికుడి వేతనంతో నలుగురిని నియమించుకుని, పని చేయిస్తోందనే విమర్శలు ఉన్నాయి.
కాంట్రాక్టు కార్మికులకు ప్రతీనెల 7వ తేదీలోగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ కాంట్రాక్టరు చెల్లించకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా యాజమాన్యమే చెల్లించాలి. ఆ తర్వాత వారి బిల్లుల్లో రికవరీ చేసేలా నిబంధనలు ఉన్నాయి.
–శ్రీనివాసులు, డీవైసీఎల్సీ
2013లో జరిగిన చర్చల్లో 9వ వేజ్బోర్డ్ ఆధారంగా కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని ఒప్పందం కుదిరింది. ఈ మేరకు కోలిండియాలో అప్పటి నుంచి అమలవుతున్నా సింగరేణిలో నేటికీ చెల్లించకపోవడం గమనార్హం. అంతేకాక ప్రతీనెల 7వ తేదీలోగా వేతనం చెల్లించాలనే నిబంధనను ఉల్లంఘించి కొన్నినెలలు 15వ తేదీ వరకు కూడా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. అలాగే, పెండింగ్లో ఉన్న 74 జీఓను రీషెడ్యూల్ చేసి వేతనాలు సవరించాల్సి ఉన్నా పాత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేయిస్తున్న సంస్థ రూ.కోట్లు గడిస్తోందని.. ఇదిపోగా వేతనాల పెంపుపై నిర్లక్ష్యం వహిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.


