బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా లోపాలు | - | Sakshi
Sakshi News home page

బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా లోపాలు

Jun 29 2025 2:34 AM | Updated on Jun 29 2025 2:34 AM

బ్రిడ

బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా లోపాలు

పర్చూరు(చినగంజాం): జాతీయ రహదారి 167 ఏ అనుసంధానంగా పర్చూరు వై. జంక్షన్‌ వద్ద నిర్మిస్తున్న హైవే బ్రిడ్జి పనులు నాసిరకంగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి బ్రిడ్జికి మధ్యలో ఇరువైపులా ఉన్న ఖాళీని బలమైన ఇనుము, కాంక్రీట్‌తో నింపాలి. అయితే బ్రిడ్జికి ఎడమవైపు ఒక చోట శ్లాబ్‌ కుంగిపోయింది. శ్లాబ్‌ కింద సపోర్టుగా పెట్టిన ఇనుప కమ్మీల నిర్మాణాలు కిందకి దిగి పోవడంతో శ్లాబ్‌ కుంగిపోయింది. ఇది గమనించిన ఇంజినీర్‌లు కుంగిన దాఖలాలు లోపాన్ని బహిర్గతం కాకుండా ఉండేందుకు తాత్కాలికంగా సరిచేసే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ బ్రిడ్జి బలహీనంగా ఉంటుందని కుంగిపోయిన స్థానంలో కాంక్రీట్‌ పూర్తిగా తొలగించి తిరిగి నిర్మాణం చేపట్టాలని స్థానికులు పట్టుబడుతున్నారు. జాతీయ రహదారిపై అతి భారీ వాహనాలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని బ్రిడ్జి నిర్మాణం నాణ్యత సక్రమంగా ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు.

ఉద్యోగుల

సస్పెన్షన్‌పై విచారణ

నాదెండ్ల: గణపవరం గ్రామీణ పశువైద్యశాల వైద్యాధికారి సాంబశివారెడ్డి, వెటర్నటీ లైవ్‌స్టాక్‌ సిబ్బంది పవన్‌కుమార్‌ ఇటీవల సస్పెండ్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయమై పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు శనివారం విచారణ చేపట్టారు. ఈ నెల 19న 3.30 గంటల సమయంలో రాష్ట్ర పశుసంవర్థకశాఖ, పాడి పరిశ్రమల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సి రాజశేఖర్‌ గణపవరం పశువైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో వైద్యాధికారి సాంబశివారెడ్డి, సిబ్బంది పవన్‌కుమార్‌ లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్‌ చేశారు. ఈ విషయమై శనివారం డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు రికార్డులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. స్థానిక పశుపోషకులను విచారించారు. వైద్యాధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఇళ్లకు వచ్చి వైద్యసేవలు అందిస్తున్నారని వివరించారు.

ఆలయ నిర్మాణానికి విరాళం

నరసరావుపేటరూరల్‌: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు మేదరమెట్ల అంజమ్మ, మస్తాన్‌రావు విద్యాసంస్థల చైర్మన్‌ ఎంవీ శేషగిరిరావు, అనంతలక్ష్మీ దంపతులు విరాళంగా రూ.3 లక్షలు అందజేశారు. ఆలయ కార్యాయంలో ఈవో నలబోతు మాధవిదేవిని కలిసి విరాళం చెక్‌ను దాతలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నండూరి కాళీకృష్ణ పాల్గొన్నారు.

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో షబీనా ప్రతిభ

మంగళగిరి టౌన్‌ : జాతీయ స్థాయిలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం దావన్‌గిరిలో జరుగుతున్న జూనియర్‌ నేషనల్‌ ఎక్యూప్ట్‌ ఉమెన్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ చాటినట్లు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్‌ సందాని శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్‌ షబీనా 84 కిలోల విభాగంలో పాల్గొని కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. స్క్వాట్‌ 202.5 కిలోలు, బెంచ్‌ ప్రెస్‌ 97.5 కిలోలు, డెడ్‌ లిఫ్ట్‌ 182.5 కిలోలు, ఓవరాల్‌ 482.5 కిలోల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

భారీగా ఉద్యాన సహాయకుల బదిలీలు

నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఐదేళ్ల నుంచి పని చేస్తున్న గ్రామ ఉద్యాన సహాయకులకు శనివారం పట్టణంలోని మున్సిపల్‌ అతిథి గృహంలో బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. గుంటూరు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బి.రవీంద్రబాబు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఉద్యానశాఖ అధికార్లు ఐ.వెంకటరావు, ఎస్‌ఎంఏ కరీం ఆధ్వర్యంలో 162మందిని బదిలీ చేశారు. కార్యక్రమంలో మూడు జిల్లాల ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.

బ్రిడ్జి నిర్మాణంలో   నాణ్యతా లోపాలు 1
1/1

బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా లోపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement