
లోక్అదాలత్లో సత్వర న్యాయం పొందాలి
సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల
రేపల్లె: రాజీమార్గమే రాజమార్గమని, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జులై 5న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల చెప్పారు. స్థానిక సబ్కోర్టు హాలులో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెగా లోక్అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని, ఇప్పటికే న్యాయవాదులు, పోలీసులు, ఎకై ్సజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు జారీ చేశామన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించటమే మెగా లోక్అదాలత్ లక్ష్యమన్నారు. మెగాలోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్ కేసులతోపాటు ప్రీలిటిగేషన్ కేసులు, బ్యాంక్ లావాదేవీలు, భార్యా భర్తల వివాదాల తదితర కేసులను పరిష్కరించుకుని న్యాయం పొందవచ్చన్నారు. వేదికను వినియోగించుకుని కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవి సాయిశ్రావణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గీతా భార్గవి తదితరులు పాల్గొన్నారు.
క్షణికావేశాలతో జీవితాలు నాశనం
క్షణికావేశంలో చేసే తప్పులకు జీవితం నాశనం అవుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి.వెన్నెల అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని సబ్జైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాగద్వేషాలను వీడి ప్రేమతో జీవించాలని సూచించారు. కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రైవేటుగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేనివారి కోసం ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుబాటులో ఉంటారన్నారు. ప్రభుత్వ న్యాయవాది ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని తెలియజేశారు. ఖైదీలకు సబ్జైలులో అందుతున్న సేవలపై ఆరా తీశారు. సబ్జైలు పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దివ్య సాయి శ్రావణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గీతా భార్గవి, జైల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.