● ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి
● మూడు నెలల పాటు ముహూర్తాలు నిల్
● వివాహ అనుబంధ రంగాలపై ఆర్థిక ప్రభావం
బద్వేలు : ఇక నుంచి మూడు నెలల పాటు శుభ కార్యాలకు మంచి రోజులు లేవు. నవంబర్ 27 నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యం వల్ల పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలకు విరామం ఏర్పడింది.
పవిత్ర తిథులు..
మార్గశిర, మాఘ, ఫాల్గుణ మాసాల్లో శుభకార్యాలు అధికంగా జరుగుతాయి. ఈ సారి మార్గశిరంలో ఒకటి రెండు ముహూర్తాలు ఉండగా పుష్యమాసం శూన్యమాసం కావడంతో మాఘంలోనూ ఒక్క ముహూర్తం లేకపోవడం గమనార్హం. గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, సరస్వతి జన్మదినమైన వసంత పంచమి, మహామాఘగా కీర్తించబడే మాఘ పౌర్ణమి వంటి తిఽథులు ఈసారి మూఢంలో కలిసిపోయాయి.
వివాహ అనుబంధ రంగాలపై ప్రభావం..
శుభకార్యాలు లేకపోతే దానికి అనుబంధంగా ఉండే అనేక రంగాలు కుదేలవుతాయి. వివాహ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, వస్త్ర వ్యాపారాలు, బంగారు దుకాణాలు, స్వర్ణకారులు, క్యాటరింగ్, ఫొటో వీడియో గ్రాఫర్లు, పూల దుకాణాలు, లైటింగ్, డీజేలు, అద్దె వాహనాలు, బాజాభజంత్రీలు, తప్పెట్లు ఇలా వివాహ అనుబంధ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వందలాది కుటుంబాలు నెలల కొద్దీ నష్టపోవాల్సి వస్తోంది. ఇక పౌరోహిత్యమే తమ జీవనోపాధిగా ఉన్న బ్రాహ్మణులు ఈ మూడు నెలల కాలం గడ్డు పరిస్థితులు అనుభవించాల్సి వస్తోంది.


