ప్రమాదాల నివారణే ప్రామాణికం
ఈ నిబంధనలు తప్పనిసరి
రాయచోటి: ప్రమాదాల నివారణే ప్రామాణికంగా రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.విద్యార్థుల బాగోగులను దృష్టిలో ఉంచుకొని చర్యలను చేపడుతున్నట్లు జిల్లా రవాణా అధికారి ప్రసాద్ చెబుతున్నారు.ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో నిత్యం స్కూలు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల బస్సులను మరోమారు తనిఖీలు చేయాలని అధికారులు అదేశించడంతో రవాణా శాఖ అధికారులు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు జిల్లాలో తనిఖీలు చేపడుతున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులు దాదాపు 750 ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగిన తనిఖీల్లో 120 విద్యా సంస్థల బస్సులను తనిఖీలు చేయగా కొన్ని బస్సులకు సరైన పరికరాలు, పత్రాలు లేకపోవడంతో వాటిని మరమ్మతులు చేయించుకొని తిరిగి రవాణా శాఖ అధికారుల ద్వారా తనిఖీలు చేయించుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు.
పరిమితికి మించి విద్యార్థుల తరలింపు
జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థ బస్సులో సీటింగ్ కెపాసిటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు తరలిస్తున్నారు. బస్సులో ఇద్దరు విద్యార్థులు కూర్చొనే సీటులో ముగ్గురు లేక నలుగురిని కూర్చొపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించి ఉదయం, సాయంత్రం సమయాల్లో తనిఖీలు చేస్తే బాగుంటుదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రతి విద్యా సంస్థ బస్సుకు స్పీడు గవర్నెన్స్ ఉండాలి
2019 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనానికి తప్పనిసరిగా ఫైర్ అలారం ఉండాలి
2020 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన బస్సుకు డ్రైవర్ దగ్గర ఫైర్ పరికరాలు ఉండాలి
ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు ఉండాలి
వాహనానికి సంబంధించిన ట్యాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్ ఉండాలి
డ్రైవర్కు తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
విద్యార్థులను సీటింగ్ కెపాసిటీ ప్రకారం మాత్రమే కూర్చొబెట్టాలి
విద్యా సంస్థల బస్సులపై ప్రత్యేక దృష్టి
ప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేస్తాం
జిల్లాలో ఉన్న ప్రతి విద్యా సంస్థ బస్సును కేటాయించిన తేదీకల్లా తనిఖీలు చేయించుకోవాలి. ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా ఉండాలి. తనిఖీలు చేయించుకోవాలని ఇప్పటికే విద్యా సంస్థల యాజమాన్యాలకు సమాచారం ఇచ్చాం. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. –ప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి
ప్రమాదాల నివారణే ప్రామాణికం


