చిట్వేలిలో 41 మిల్లిమీటర్ల వర్షం
రాయచోటి: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంగా జిల్లాలో రెండు రోజులుగా తేలికపాటి జల్లులుతో కూడిన వర్షం కురుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జిల్లాలోని 30 మండలాల్లో వర్షం కురిసింది.కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో 41 మిల్లీ మీటర్లు, కోడూరులో 34 పుల్లంపేటలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా అధికారులను కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తం చేశారు. సోమవారం భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం మేరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. గత మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. చలిగాలులకు పిల్లలు వృద్ధులు గజగజ ణుకుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షపు జల్లుల కారణంగా ప్రజారవాణా స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 1వతేదీన ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను ’’సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.
’దిత్వా’ తుఫాను వేళ
ఆప్రమత్తంగా ఉండండి
’దిత్వా’ తుఫాను కారణంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం కురిసే సందర్భంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు కూలిపోవడం లాంటి సంఘటనలు జరిగినట్లయితే వెంటనే తమ సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు గానీ సిబ్బందికి గానీ సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబరు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని తెలియజేశారు.


