మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. మీరు మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు: వైఎస్‌ జగన్‌

Jun 6 2025 8:36 PM | Updated on Jun 6 2025 9:15 PM

YS Jagan Mohan Reddy Slams Chandrababu Govt
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
  • చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం
  • లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా కుప్పకూలిపోయింది
  • తప్పుడు కేసులు పెట్టడం,జైళ్లకు పంపడం పరిపాటిగా మారిపోయింది
  • కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ ధ్వజం

తాడేపల్లి :  ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన శాంతిభద్రతపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘రాజకీయ కక్షలతో చంద్రబాబుగారు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా లా అండ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.అత్యంత భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్నవారు అహంకారం, రౌడీయిజంతో చెలరేగిపోయి, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఫలితంగా జరుగుతున్న ఘటనలు అత్యంత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. 

అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని ఏ రకంగా అదుపాజ్ఞ‌ల్లోకి తీసుకుందో చెప్పడానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన  ప్రత్యక్ష ఉదాహరణ. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భార్య డ్రైవర్ మ‌ద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, చలానా రాసినందుకు ఆ ఎమ్మెల్యే ఆ కానిస్టేబుల్‌ను రప్పించుకుని, సీఐ సమక్షంలో నిందితుడైన అదే డ్రైవర్‌తో దాడిచేయిస్తారా? , చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఆ ఘటనను మూసివేసేలా ప్రయత్నించి వ్యవస్థలకే తలవంపులు తెస్తున్నారు. ఒక పోలీసుకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడిది?’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 

తప్పుడు కేసులు పెట్టడం పరిపాటిగా మారిపోయింది
‘రాజకీయ కక్షలతో నిర్దోషులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని జైళ్లకు పంపడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయిందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన   వైఎస్సార్‌సీపీ కార్యకర్త రెడ్యం శివలక్ష్మీనారాయణపై అక్రమంగా కేసుపెట్టి, తీవ్రంగా కొట్టారు.. లంచం ఇవ్వలేదని లేని గంజాయి కేసుపెట్టి 2 నెలలపాటు జైలుకు పంపడంతో అవమానాలు భరించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.10 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. 

చంద్రబాబుగారి ఏడాదిపాలనలో రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి గురైన ఇలాంటి కుటుంబాలెన్నో ఉన్నాయి. లక్ష్మీనారాయణకు జరిగిన అన్యాయానికి బాధ్యత ఎవరిది?, అక్రమకేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?, వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదా?, ప్రజాసమస్యల పరిష్కారంపై గళమెత్తుతూ వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు టీడీపీ వాళ్లు కక్షగట్టి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీదివేముల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌నాయుడును కత్తులతో పొడిచి, బండరాయితో కొట్టి చంపేశారు.ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల తరఫున ఎవ్వరూ కార్యక్రమాలు నిర్వహించకూడదా?’ అని నిలదీశారు వైఎస్‌ జగన్‌. 

 మీ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు
అలా చేస్తే చంపేస్తారా? పోలీసుల పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్‌ సరిగ్గా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా?  , శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు గుర్రాకులపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం అత్యంత అమానవీయం. ఈ ఘటనపై కనీసం ఫిర్యాదుకూడా ఇవ్వనీయకుండా టీడీపీ వాళ్లు భయపెట్టారు. 

నిందితులకు అధికారపార్టీ అండదండలు ఉండడంతో వారిని ఎదిరించే ధైర్యం లేక  తండ్రిలేని ఆ బాలిక కుటుంబం ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయింది. పోలీసులది ప్రేక్షక పాత్రే అయ్యింది.  ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడకూడదు.చట్టాన్ని అపహాస్యం చేసి, బాధితులకు న్యాయాన్ని నిరాకరించి, అధికార పార్టీకి చెందినవారని ఆ నిందితులను స్వేచ్ఛగా వదిలేసినప్పుడు, ఈ పరిణామాలన్నింటినీ మౌనంగా చూస్తున్నప్పుడు కేవలం పాలనమాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యవస్థలన్నీకూడా కుప్పకూలిపోతాయి. చంద్రబాబుగారూ మీరు మీ పద్ధ‌తిని మార్చుకోకపోతే  ప్రజలు ఇక ఎల్లకాలం చూస్తూ ఊరుకోరు. బాధితులకు న్యాయం జరిగేలా వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement