పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందంటే..?

Administration Decentralization Bill approval process is completed in Ten and half months - Sakshi

నిపుణుల కమిటీ నుంచి గవర్నర్‌ ఆమోదం దాకా..

పదిన్నర నెలల్లో ఆమోద ప్రక్రియ పూర్తి

సాక్షి, అమరావతి: ► 2019 సెప్టెంబర్‌ 13: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డు ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు.
► 2019 డిసెంబర్‌ 20: రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్‌ కేపిటల్‌), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్‌ కేపిటల్‌ (న్యాయ రాజధాని) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి జీఎన్‌ రావు కమిటీ నివేదిక.  
► 2019 డిసెంబర్‌ 27: జీఎన్‌ రావు కమిటీ నివేదిక, బీసీజీ(బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌) నివేదికలపై అధ్యయనం కోసం హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
► 2019 డిసెంబర్‌ 29: హైపవర్‌ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.
► 2020 జనవరి 3: రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణ ఏకైక మార్గమని పేర్కొంటూ మూడు రాజధానుల ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి
బోస్టన్‌ కన్సెల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక
► 2020 జనవరి 17: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక ఇచ్చిన హైపవర్‌ కమిటీ
► 2020 జనవరి 20: హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించి పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన శాసనసభ.
► 2020 జనవరి 22: శాసనసభ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించకుండా, తిరస్కరించకుండా శాసనమండలిలో తొండాట ఆడిన టీడీపీ
► 2020 జూన్‌ 16: అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఆమోదించిన శాసనసభ
►2020 జూన్‌ 17: శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా సైంధవపాత్ర పోషించిన టీడీపీ
► 2020 జూలై 18: శాసనమండలిలో రెండు పర్యాయాలు టీడీపీ మోకాలడ్డినప్పటికీ నిర్దిష్ట కాల పరిమితి ముగియడంతో ఇక శాసనమండలితో పనిలేకుండా పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం
► 2020 జూలై 31: పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

సీఆర్‌డీఏ స్థానంలో ‘ఏఎంఆర్‌డీఏ’
సీఆర్‌డీఏ (క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) రద్దు బిల్లును గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించడంతో ఇక ఆ సంస్థ కనుమరుగుకానుంది. ఆ స్థానంలో ఏఎంఆర్‌డీఏ (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు కానుంది. సీఆర్‌డీఏ కార్యకలాపాలన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ ఉద్యోగులంతా ఏఎంఆర్‌డీఏ ఉద్యోగులుగా మారతారు. 
► భూసమీకరణ సహా రాజధాని వ్యవహారాలన్నీ ఈ సంస్థే నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ చేసుకున్న అగ్రిమెంట్లు, కాంట్రాక్టులన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ కిందకు వస్తాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పుడు సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న ప్రాంతమంతా ఏఎంఆర్‌డీఏ కిందకు వస్తుంది. రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఏఎంఆర్‌డీఏ కృషి చేస్తుంది.
► 2014 డిసెంబర్‌లో టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం ద్వారా సీఆర్‌డీఏ ఏర్పాటైంది.
► అప్పటివరకూ ఉన్న వీజీటీఎం ఉడా (విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) స్థానంలో సీఆర్‌డీఏను ఏర్పాటు చేశారు. 
► ‘వీజీటీఎం ఉడా’ 2014లో ‘సీఆర్‌డీఏ’గా మారగా ఇప్పుడు ‘ఏఎంఆర్‌డీఏ’గా కొత్తరూపం దాల్చనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top