ఏదీ సమాచారం.. ఇదేం ఘోరం! | - | Sakshi
Sakshi News home page

ఏదీ సమాచారం.. ఇదేం ఘోరం!

Jun 4 2025 12:29 AM | Updated on Jun 4 2025 12:29 AM

ఏదీ సమాచారం.. ఇదేం ఘోరం!

ఏదీ సమాచారం.. ఇదేం ఘోరం!

అనంతపురం ఎడ్యుకేషన్‌: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఏ చిన్న సమాచారం కూడా బయటకు చెప్పకుండా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పూర్తిగా గోప్యత పాటిస్తుండడంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది టీచర్లు బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసుకున్నారు. రోజూ 3–4 సార్లు రాష్ట్ర అధికారులు వెబెక్స్‌లు పెట్టుకుంటూ వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవేవీ క్షేత్రస్థాయిలో ఉండే టీచర్లకు చేరడం లేదు. కనీసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్న గ్రూపుల్లో షేర్‌ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పోనీ మీడియా ద్వారానైనా ఉపాధ్యాయులకు తెలియజేసే ప్రయత్నాలు చేయకపోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. పొరుగు జిల్లాలకు సంబంధించి రోజూ స్వయంగా డీఈఓల పేరుతోనే వివిధ మెసేజ్‌లు టీచర్ల గ్రూపుల్లో వైరల్‌ అవుతున్నాయి తప్ప మన జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా సీనియార్టీ జాబితాలు, ఖాళీల విషయం ఏమాత్రం బయటకు చెప్పడం లేదు. రెండు రోజుల క్రితం పీఎస్‌హెచ్‌ఎంల బదిలీలయ్యాయి. ఆయా సబ్జెక్టుల్లో మిగులుగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లకు పీఎస్‌హెచ్‌ఎంలుగా మంగళవారం బదిలీలు చేశారు. అయితే ఎంతమంది పీఎస్‌ హెచ్‌ఎంలుగా వెళ్లారు... ఏయే సబ్జెక్టుల వారు వెళ్లారు...వీరిలో తప్పనిసరి, రిక్వెస్ట్‌ బదిలీలు ఎవరు అనే సమాచారం రాత్రి 10 గంటలు దాటినా బయటకు చెప్పలేదు.

తుస్‌...మన్న కోఆర్డినేషన్‌ సమావేశం

బదిలీ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రెండోరోజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓను అడ్డుకుని నిరసన తెలియజేశారు. డీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదని, ఇతర జిల్లాల అధికారులు గ్రూపుల్లో పెడుతున్న సమాచారానికి అనుగుణంగా ముందుకు వెళ్లే దౌర్భాగ్యం నెలకొందంటూ వాపోయారు. ఇకపై అలా జరగదని, మరుసటి రోజే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కోఆర్డినేషన్‌ సమావేశం ఏర్పాటు చేస్తామన్న డీఈఓ.. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదని నాయకులు మండిపడుతున్నారు.

ఖాళీలు చూపించకుండానే

వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలట!

స్కూల్‌ అసిస్టెంట్లకు సంబంధించి ఖాళీలు ప్రదర్శించకుండానే బుధవారం వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలని చెబుతున్నారంటూ టీచర్లు వాపోతున్నారు. సీనియార్టీ జాబితా, ఖాళీలు ప్రకటించిన తర్వాత అభ్యంతరాలకు గడువు ఇవ్వడం లేదంటున్నారు. గుత్తి కోట జెడ్పీహెచ్‌ఎస్‌లో గణితం టీచరు ఇటీవల హెచ్‌ఎం పదోన్నతిపై కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ పోస్టు ఖాళీ చూపించలేదు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి బాలికల జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచరు జనవరిలో రిటైర్డ్‌ అయ్యారు. ఆ పోస్టు ఖాళీ చూపించలేదు. ఇక్కడ హిందీ ఒక పోస్టు ఖాళీగా ఉంటే రెండు పోస్టులున్నట్లు చూపించారు. బుధవారం వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలంటూ అధికారులు చెబుతున్నారు. ఉన్న ఖాళీలను చూపించకుండా, లేని ఖాళీలను చూపించిన స్కూళ్లు కోరుకుంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ టీచర్లు వాపోతున్నారు.

టీచర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారు: ఏపీటీఎఫ్‌

మంగళవారం సాయంత్రం పాఠశాల సహాయకుల సీనియార్టీ, వేకెన్సీ జాబితాలు విడుదల చేసి గ్రీవెన్స్‌కు ఒకరోజు సమయం ఇవ్వకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేసి వెబ్‌ ఆప్షన్లు ఇవ్వమని వేధిస్తున్నారని ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌. సిరాజుద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సీనియారిటీ, వేకెన్సీ జాబితాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఈఓ ప్రసాద్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి విద్యాశాఖ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో తీవ్ర గందోరగోళం నెలకొందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కన్వీనర్‌ వన్నప్ప, నాయకులు గురు రాజ్‌, నాగేంద్ర, ఈశ్వరయ్య, భాగ్యరాజ్‌, దాసరి మురళి, ఓబులేసు, చిదంబరయ్య, వెంకటరామిరెడ్డి, చక్రి, రాజశేఖర్‌, విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బదిలీలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు చెప్పని విద్యాశాఖ

ఆందోళనలో ఉపాధ్యాయులు

నేడు స్కూల్‌ అసిసెంట్ల

బదిలీలకు వెబ్‌ ఆప్షన్లు

ఖాళీలు చూపించలేదంటున్న టీచర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement