
నేడు వెన్నుపోటు దినం..
హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి సర్కారు తీరును నిరసిస్తూ ‘వెన్నుపోటు దినం’ పేరుతో వైఎస్సార్ సీపీ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కనున్నాయి.
ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దాం
అనంతపురం కార్పొరేషన్: వెన్నుపోటు నిరసన ర్యాలీతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు అనంతపురంలోని పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై, కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. ఉదయం 9.30 గంటలకంతా చెన్నకేశవ స్వామి ఆలయం వద్దకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లోనూ ‘వెన్నుపోటు దినం’ ర్యాలీలు ఉంటాయన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారని ‘అనంత’ గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్తో పాటు 175 హామీలను ప్రకటించిన చంద్రబాబు .. ఇంత వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని, ప్రభుత్వ మెడలు వంచైనా ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

నేడు వెన్నుపోటు దినం..