
ఐఐఏఎం బిజినెస్ స్కూల్లో విదేశీ విద్య
ఎంవీపీకాలనీ: ఐఐఏఎం(ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్) బిజినెస్ స్కూల్ విదేశీ విద్యను అందించేందుకు ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ఐజీఎంఏ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవీపీకాలనీలోని ఐఐఏఎం బీ–స్కూల్లో బుధవారం ఇరు సంస్థల ప్రతినిధులు ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఐఐఏఎం కార్యదర్శి, డీన్ డాక్టర్ సుంకరి రవీంద్ర మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో యువతకు నాణ్యమైన విద్యను అందించి.. అంతర్జాతీయ ఉద్యోగ, వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు. ఐఐఏఎం బీ–స్కూల్ డైరెక్టర్ జనరల్ ఆచార్య కృష్ణమోహన్ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీలకు సంబంధించిన కోర్సులు ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యార్థులు ఏడాది పాటు దుబాయ్లో విద్యనభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఈ కోర్సులకు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆమోదం ఉందన్నారు. ఐజీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మోహన్లాల్ అగర్వాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ అవకాశాలను యువతకు చేరువ చేసేందుకు ఈ ఎంవోయూ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. విశాఖతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో సర్వీస్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ విద్య విశిష్టత, కార్పొరేట్ అవసరాలు, ఏఐ సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన్ని ఐఐఏఎం బీస్కూల్ ప్రతినిధులు సత్కరించారు.
ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో కుదిరిన ఒప్పందం