
పీడీపీఎస్.. అమలయ్యేనా?
● పత్తి కొనుగోళ్లపై కేంద్రం నూతన విధానం ● ఆదిలాబాద్లో ఈ సీజన్ నుంచే పైలట్ ప్రాజెక్టుగా.. ● ఇక వ్యాపారులే కొంటారు.. ● ఎంఎస్పీ కంటే తక్కువ ఉంటే ఆ వ్యత్యాసాన్ని సీసీఐ ద్వారా రైతులకు చెల్లింపు ● ప్రస్తుత విధానమే మేలంటున్న కాటన్ అసోసియేషన్
ప్రస్తుత విధానమే మేలు..
న్యూ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రధానంగా ప్రస్తుత కొనుగోలు విధానమే రైతులకు మేలని స్పష్టం చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచి తప్పనిసరిగా ఈ స్కీమ్ అమలు చేయాలనే లక్ష్యంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికీ కేంద్రానికి హామీ ఇవ్వలేదని మా దృష్టిలో ఉంది. ప్రధానంగా వ్యాపారుల వద్ద డ బ్బులు ఉన్నంతవరకు పత్తిని కొనుగోలు చేయగలుగుతారు. ఆ తర్వాత వ్యాపారులు కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంది. ఈ నేపథ్యంలోనే సీసీఐ కూడా కొనుగోలు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.
– మనీష్ మాల్పాని,జిన్నింగ్ మిల్లు యజమాని
ఆ మండలాల రైతులే అమ్మాలి..
పీడీపీఎస్ అమలైన పక్షంలో ఆదిలాబాద్ ఏఎంసీ నోటిఫైడ్ మండలాలైన తలమడుగు, తాంసి, భీంపూర్, ఆదిలాబాద్అర్బన్, ఆదిలాబాద్రూరల్, మావల రైతులు మాత్రమే మార్కెట్ యార్డులో పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఇతర మండలాల రైతులు విక్రయించడానికి వీలుండదు. ఆదిలాబాద్ మార్కెట్లో ఉన్న వసతుల దృష్ట్యా ప్రస్తుత విధానంలో అటు వ్యాపారులు కొనుగోలు చేసినా, ఇటు సీసీఐ కొనుగోలు చేసినా ప్రతిరోజు రూ.20కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచే కాకుండా, పక్క జిల్లాలోని కొన్ని మండలాల నుంచి రైతులు ఆదిలాబాద్ మార్కెట్కు వచ్చి పత్తిని విక్రయిస్తారు.
– గోవర్ధన్ యాదవ్, రైతు సంఘం నాయకుడు
సాక్షి,ఆదిలాబాద్: ధర వ్యత్యాస చెల్లింపు పథకం (పీడీపీఎస్)ను పత్తి కొనుగోళ్ల పరంగా దేశంలో అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. రా ష్ట్రంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఆదిలాబా ద్ మార్కెట్లో ఈ సీజన్ నుంచే అమలు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది.
పీడీపీఎస్ అమలైతే..
భారత పత్తి సంస్థ (సీసీఐ) పత్తిని కొనుగోలు చేయ దు. మార్కెట్లో వ్యాపారులు మాత్రమే రైతుల నుంచి విక్రయిస్తారు. అలాంటప్పుడు ఇక సీసీఐ ఉంటుందా.. కనుమరుగవుతుందా అనే సందేహాలు రావచ్చు. అయితే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే రైతులకు మార్కెట్లో తక్కువ ధర లభించిన పక్షంలో ఆ వ్యత్యాసాన్ని కేంద్రం భరిస్తుంది. సీసీఐ ద్వారా ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తోంది. అదే ఈ స్కీమ్ ఉద్దేశం. మార్కెట్లో ఎంఎస్పీ కంటే తక్కువ ధర ఉన్నప్పుడు రైతులకు ఆ వ్యత్యాసాన్ని చెల్లించడం ద్వారా వారికి నష్టం కలగకుండా చూడాలన్నదే ప్రభుత్వ భావన.
ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో చర్చ..
జూన్ 19న న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్ భవన్లో చైర్మన్ ప్రొఫెసర్ రమేశ్చంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో పీడీపీఎస్ అమలుతో ఎదుర య్యే ఇబ్బందులు, సవాళ్లపై చర్చించారు. నీతి ఆ యోగ్, సీసీఐ ఉన్నతాధికారులు, వివిధ రాష్ట్రాల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, కాటన్ అసోసియేషన్ సభ్యులు, ఎంపిక చేసిన రైతులు పా ల్గొన్నారు. జిల్లా నుంచి జిన్నింగ్ మిల్లు వ్యాపారి మనీష్ మాల్పాని, రైతు సంఘం నుంచి గోవర్ధన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ స్కీమ్ అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై నీతి ఆయోగ్ అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. ఇందులో పాల్గొన్న తెలంగాణ కాటన్ అసోసియేషన్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు వరంగల్కు చెందిన బొమ్మినేని రవీందర్ రడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సీసీఐ ద్వారా చేపడుతున్న కొనుగోలు విధానమే రై తులకు బాగుందని, ఇకముందు కూడా కొనసాగి స్తేనే మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు. మ రోపక్క రైతు సంఘం నాయకులు కూడా సందేహా లు వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యత్యాస ధర రైతులకు ఎ న్ని రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
ఎలాంటి ఉత్తర్వులు అందలేదు..
పీడీపీఎస్ అమలు విషయంలో ఇప్పటివరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. విధివిధానాలు ఖరారు కాలేదు. ఈ కొనుగోలు సీజన్ నుంచి ఈ విధానం అమలవుతుందా అని ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వాల నిర్ణయాల మేరకు ముందుకెళ్తాం.
– గజానంద్, జిల్లా మార్కెటింగ్ అధికారి
సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి
ఆదిలాబాద్ వంటి పెద్ద మార్కెట్లో పైలట్ ప్రాజెక్ట్గా ఈ సిస్టమ్ను అమలు చేయాలనుకోవడం సరికాదు. మొదట ఓ చిన్న మార్కెట్లో అమలు చేసి దాన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. అలాంటప్పుడే లోపాలు తెలుస్తాయి.
– రాజు చింతవార్, వ్యాపారి

పీడీపీఎస్.. అమలయ్యేనా?

పీడీపీఎస్.. అమలయ్యేనా?