
పైచదువులు ఇష్టంలేక విద్యార్థి ఆత్మహత్య
దండేపల్లి(మంచిర్యాల): పై చదువులు ఇష్టంలేక ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దండేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పొన్నం చంద్రగౌడ్, మాధవి దంపతుల కుమారుడు పొన్నం తరుణ్గౌడ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. బీటెక్ చదవాలని తండ్రి సూచించడంతో నాకు పైచదువులు ఇష్టం లేదని, ఏదైనా వ్యాపారం చేసుకుంటానని చెప్పాడు. అయితే బీటెక్ అయ్యాక వ్యాపారం చేసుకొమ్మని తండ్రి నచ్చజెప్పాడు. ఇటీవల హైదరాబాద్కు వెళ్లి కొన్ని బీటెక్ కాలేజీలు కూడా చూసివచ్చారు. అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గదిలో ఉన్న తరుణ్ను భోజనానికి పిలిస్తే రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లిచూడగా ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి చంద్రగౌడ్ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇంటర్ ఇష్టంలేక ఒకరు..
లోకేశ్వరం(ముధోల్): మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బిలోలిలో చోటు చేసుకుంది. ఏఎస్సై దిగంబర్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఓల్కర్ బీరన్న–రాంబాయి దంపతుల కుమారుడు గంగాధర్ (17)నిర్మల్ పట్టణంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ఇటీవల పదోతరగతి పూర్తి చేశాడు. ఇంటర్ చదివేందుకు నిజామాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో అప్లై చేసుకున్నాడు. అయితే హోటల్ మేనేజ్మెంట్ చేస్తానని, ఇంటర్ చదవనని చెప్పడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం తమ పంటచేనులో మద్యం సీసాలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఒకరు..
సిరికొండ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏస్సై శ్రీసాయి, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రనికి చెందిన దోండే రవీంద్రనాథ్ (48) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు సమాచా రం అందించాడు. రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై యువకుడు..
కడెం: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని పెద్దూర్తండాకు చెందిన హపవత్ సురేశ్ (22) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం మద్యం మత్తులో పెద్దూర్ సమీపంలోని ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుని తల్లి అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇద్దరిపై కేసు నమోదు
తానూరు: ఆటో డ్రైవర్పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలిపారు. హిప్నెల్లితండాకు చెందిన రాథోడ్ అశ్విన్ తన ఆటోలో ప్రయాణికులను ఎక్కంచుకుని వెళ్తుండగా అందులో ప్రయాణిస్తున్న రాథోడ్ గురుజీ, సునీల్ గొడవపడ్డారు. వారిని ఆటోలోంచి దిగిపొమ్మనడంతో ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డారు. గాయాలు కావడంతో అశ్విన్ను స్థానిక ఆస్పత్రికి తరిలించారు. బాధితుని తల్లి అంజనాబాయి ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పైచదువులు ఇష్టంలేక విద్యార్థి ఆత్మహత్య

పైచదువులు ఇష్టంలేక విద్యార్థి ఆత్మహత్య

పైచదువులు ఇష్టంలేక విద్యార్థి ఆత్మహత్య