
నీటిగుంతలో పడి బాలుడు మృతి
కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండలం హల్దా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ బాలుడు గుంతలో పడి మృతిచెందాడు. గ్రామానికి చెందిన షల్కె సాయినాథ్(09) బహిర్భూమికి వెళ్లాడు. తర్వాత చెరువులోని నీటిగుంత వద్దకు వెళ్లాడు. అదుపు తప్పి గుంతలో పడ్డాడు. మొరం కోసం తవ్విన గుంత కావడం, ఇటీవల కురిసిన వర్షాలకు గుంత నిండడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. తండ్రి అనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
తాండూర్: మండలంలోని రేపల్లెవాడ శివారు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. తాండూర్ ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి వైపు నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ భుక్య రాజేష్(37) అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కన కూర్చున్న రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సోమగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోటోవేటర్ కింద పడి యువకుడి మృతి
భైంసా: నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్(28) మంగళవారం ట్రాక్టర్ రోటవేటర్ కింద పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో భూమి చదును చేస్తుండగా ట్రాక్టర్పై ప్రవీణ్ కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపతప్పి కిందపడి రోటావేటర్లో చిక్కుకున్నాడు. గమనించిన డ్రైవర్ ట్రాక్టర్ను ఆపి చూసేసరికి మృతిచెందాడు. ప్రవీణ్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి కుటుంబీకులు ట్రాక్టర్ యజమాని న్యాయం చేయాలని, అప్పటి వరకు మృతదేహం తరలిచొద్దని పట్టుబట్టారు. ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ సంఘటన స్థలానికి చేరుకుని సముదాయించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.