breaking news
trees and branches
-
పిల్లల కథ-‘మూడు ముళ్ళ చెట్టు’
ఒక అడవిలో మూడు ముళ్ళ చెట్లు ఉండేవి. వాటి ఆకులు చేదుగా, పూలు ఏమాత్రం వాసన లేకుండా ఉండేవి. దానితో జనాలుగానీ, పశువులుగానీ, పక్షులుగానీ ఏవీ ఆ చెట్ల దగ్గరికి వచ్చేవి కావు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ చెట్లు చాలా దిగులు పడ్డాయి. వనదేవతను తలచుకొని కన్నీరు పెట్టుకున్నాయి. కాపాడమని వేడుకున్నాయి. వనదేవత ‘సరే దిగులు పడకండి. మీకేం కావాలో కోరుకోండి’ అంది. ‘నాకు ఎంతో విలువైన బంగారు ఆకులు కావాలి’ అంది మొదటి చెట్టు. ‘నాకు సువాసన వెదజల్లే ముచ్చటైన రంగురంగుల పూలు కావాలి’ అంది రెండో చెట్టు. ‘నాకు కొమ్మ కొమ్మకు నిండుగా తియ్యని పళ్ళు కావాలి’ అంది మూడవ చెట్టు. ‘అలాగే’ అని దీవించింది చిరునవ్వుతో వనదేవత. అంతే.. మరుక్షణం మొదటి చెట్టు ఆకులన్నీ బంగారం అయిపోయాయి. సూర్యుడి కిరణాలు పడి ధగధగ మెరిసిపోసాగాయి. రెండవ చెట్టుకు రంగురంగుల పూలు పూచాయి. మనసు పరవశమయ్యేలా మధురమైన వాసన వెదజల్లసాగాయి. మూడవ చెట్టుకు సందు లేకుండా తీయని పళ్ళు కాశాయి. వాటి బరువుకు చెట్టుకొమ్మలు కిందికి వంగి ఊగసాగాయి. ఆ మూడు చెట్లు తమను తాము చూసి మురిసిపోయాయి. ఒకదానిని చూసి మరొకటి సంబరపడ్డాయి. రాత్రంతా ఆనందంతో నవ్వుకున్నాయి. మాటలతో మైమరచిపోయాయి. పొద్దు పొడిచింది. ఆ దారిలో నెమ్మదిగా మనుషుల సందడి మొదలైంది. ఆ దారిన పోతూ ఉన్న ఒకతను ఆ బంగారు చెట్టును చూశాడు. ‘ఆహా ఏమి నా అదృష్టం’ అనుకొని పరుగెత్తుకుంటూ వచ్చి కొమ్మలన్నీ విరగ్గొట్టాడు. ఒక్క ఆకు కూడా మిగలకుండా తెంచుకెళ్లాడు. ఒంటిమీద దెబ్బలతో విలవిల్లాడిపోయింది మొదటి చెట్టు. కాసేపటికి ఒక పిల్లల గుంపు అటువైపు వచ్చింది. వాళ్లు పళ్ళచెట్టును చూశారు. ఒకటి తిని ‘ఆహా ఎంత తీయగా ఉన్నాయి పళ్ళు’ అనుకున్నారు. అంతే కోతుల్లాగా చెట్టు మీదికి ఎగబాకారు. అందిన పళ్ళన్నీ తెంపారు. అందకపోతే కొమ్మలు విరిచారు. రాళ్లతో కొట్టారు. ఒక చిన్న పిందె కూడా మిగలకుండా నున్నగా ఊడ్చుకుపోయారు. విరిగిన కొమ్మలను చూసుకుంటూ నొప్పితో అల్లాడిపోయింది రెండో చెట్టు. అంతలో కొంతమంది ఆడపిల్లలు అటువైపు వచ్చారు. రంగురంగుల పూలచెట్టు వాళ్ళ కంటపడింది. ‘ఆహా ఎంత సువాసన వెదజల్లుతున్నాయి ఈ సుందరమైన పూలు’ అనుకుంటూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. దొరికిన పూలన్నీ చిన్న మొగ్గ కూడా వదలకుండా కోసుకున్నారు. ‘ఈ చెట్టును తీసుకుపోయి ఇంట్లో నాటుకుందాం’ అంటూ తలా ఒక కొమ్మ విరగ్గొట్టారు. అప్పటిదాకా పూలతో కళకళలాడిన చెట్టు ఒక్క నిమిషంలో విరిగిన కొమ్మలతో బోడిదైపోయింది. మూడూ ఒకదానిని చూసి మరొకటి కళ్ళనీళ్లు పెట్టుకున్నాయి. ‘ఇకపైనుంచి మన బతుకులు ఇంతేనా? చిగుర్లు వేసినా, పూలు పూసినా, కాయలు కాసినా దెబ్బలు తప్పవు. ఇలా భయం భయంగా బతికే కన్నా ఇంతకుముందులా ఉంటేనే మేలు’ అనుకున్నాయి. వనదేవతను వేడుకున్నాయి. ‘తల్లీ తప్పయిపోయింది. మా మొదటి రూపమే మాకివ్వు. ఈ ఆకులూ వద్దు, పూలూ వద్దు, పళ్ళూ వద్దు. ఏ గొడవ లేకుండా మా బతుకేదో మేం బతుకుతాం’ అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాయి. వనదేవత చిరునవ్వు నవ్వి ‘సరే’ అంది అనునయంగా ఓ అమ్మలా! -డా.ఎం.హరి కిషన్ -
చెట్టుంది జాగ్రత్త
ఉద్యాననగరిలో చీటికిమాటికీ కూలుతున్న వృక్షాలు ♦ ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ♦ పర్యవేక్షణ లేని పాలికే చల్లని నీడనిచ్చే చెట్టు ప్రాణాలను తీస్తుందా.. ఏమిటీ జోక్, ఎవరైనా వింటే నవ్విపోతారు అని అనుకోవచ్చు. కానీ బెంగళూరులో తరచూ పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడం, అవి వాహనాలు, ప్రజల మీద పడి ప్రాణనష్టం జరగడం తరచూ జరుగుతోంది. అంతర్జాతీయంగా బెంగళూరు నగరానికి గార్డెన్సిటీగా పేరుప్రఖ్యాతులు రావడానికి ప్రధాన కారణమైన పచ్చని చెట్లు గత కొద్ది కాలంగా ప్రజల పాలిట మృత్యు పాశాలవుతున్నాయి. మొత్తం 800 చదరపు కిలోమీటర్ల విస్తరించిన బీబీఎంపీ పరిధిలో సుమారు 14 లక్షల చెట్లు ఉండగా వాటి నిర్వహణపై బీబీఎంపీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో చాలా ప్రాంతాల్లో చెట్లు చెదలు పట్టి కూలిపోతున్నాయి. సాక్షి, బెంగళూరు : ఉద్యాననగరంలో చెట్ల వల్ల పెద్ద చిక్కొచ్చిపడింది. శిథిలమైన, ప్రమాదకరంగా ఉన్న చెట్లు, కొమ్మలు కూలిపోతూ అనేక రకాలుగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి చెట్లను తొలగించి ప్రమాదాలు నివారించడానికి బీబీఎంపీ కాంట్రాక్ట్ పద్ధతిన 168 మందితో 21 బృందాలు నియమించింది. చెట్ల సంఖ్యతో పోలిస్తే ఈ సిబ్బంది ఏ మూలకూ చాలడం లేదు. సిబ్బంది కొరత కారణంగా చెట్ల తొలగింపు చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ బృందాలు కూడా కేవలం వర్షాకాలంలో మాత్రమే చెట్ల తొలగింపు చర్యల్లో పాల్గొంటూ మిగిలిన కాలాల్లో గాలికొదిలేస్తుండడం కూడా సమస్య జఠిలమవడానికి మరొక కారణంగా చెప్పుకోవచ్చు. విదేశీ చెట్లు పెంచడం కారణమా? బెంగళూరు పాలికే భౌగోళిక పరిస్థితి, మృత్తిక స్వభావానికి విరుద్ధంగా విదేశాల్లో పెరిగే చెట్లను ఇక్కడ కూడా పాలికే అధికారులు పెంచుతున్నారు. తబూబియా, గుల్మొహర్, రైన్ ట్రీ, కాపర్వుడ్ తదితర జాతి చెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. అందం కోసం ఖర్చుకు వెనకాడకుండా ఈ చెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వారు చెబుతున్నారు. వీటి వేర్లు భూమితి గట్టిగా పట్టుకోవు. అంతేకాకుండా ఈ జాతి చెట్లు వయస్సు కేవలం 25 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. అయితే సదరు చెట్లను ఎప్పుడు నాటారు, వాటిని ఎప్పుడు తొలగించాలి అనే రికార్డులు బీబీఎంపీ వద్ద లేవు. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట ఇటువంటి చెట్లు కూలి ప్రాణ, భారీ ఆస్తినష్టం సంభవిస్తోంది. చెట్లకు ముప్పు ఇలా వివిధ కారణాలతో నగరవ్యాప్తంగా ఉన్న భారీ చెట్ల చుట్టూ సిమెంటు గోడలు, సిమెంటు కుర్చీలను నిర్మించడంతో చెట్ల వేర్లు,కాండాలకు గాలి,నీరు అందకపోవడంతో అనేక చెట్లు నిర్జీమవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపారసంస్థలు తమ ప్రకటనల హోర్డింగులకు అడ్డుగా ఉన్నాయనే నెపంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల వేర్లలో విషపూరిత రసాయనాలు చల్లుతూ వాటిని నిర్వీర్యం చేస్తుంటారు. మురికికాలువల నిర్మాణాలు, తాగునీటి పైపులైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఓఎఫ్సీ కేబుళ్ల తదితర వాటి కోసం రోడ్లపై, రోడ్లకు ఇరువైపులా ఉన్న వేర్లు, కొమ్మలు తొలగిస్తుండడంతో చెట్లు సమతౌల్యాన్ని కోల్పోతున్నాయి. ఇలాంటి చెట్లు ఈదురు గాలులకు, వర్షాలకు ప్రజలపై కూలిపడుతూ ప్రాణనష్టాన్ని కలిగిస్తున్నాయి. గత ఐదేళ్లలో చెట్లు కూలి జరిగిన ప్రాణనష్టం ⇔ 2012 మే1న సంజయ్నగర్లోని నాగశెట్టిహళ్లిలో రావిచెట్టు కూలి రవి(45) వ్యక్తి మృతి. ⇔ 2012 జూన్6న సంపిగేహళ్లి సమీపంలోని టెలికాం లేఅవుట్లో కొబ్బరిచెట్టు కూలి వీరణ్ణ(50) మృతి. ⇔ 2013 మే8న బసవేశ్వరనగర్లోని మోదీ ఆసుపత్రి రోడ్లో ఆటోపై చెట్టు కూలి ఆటోలో ప్రయాణిస్తున్న గీత (52)మృతి. ⇔ 2015 మే 29 హొసూరు రోడ్లోని ఆనేపాళ్య బస్టాప్పై చెట్టు కూలడంతో మాధవరెడ్డి (50)మృతి, ఐదుగురికి గాయాలు. ⇔ 2015 జూన్10 ఆడుగోడిలోని సీఎస్ఆర్ వసతి సముదాయంపై చెట్టు కూలడంతో పుట్టగంగప్ప (80)మృతి. ⇔ 2015 సెప్టెంబర్18 గరుడామాల్ సమీపంలోని డిసౌజా సర్కిల్లో చెట్టు కూలి యల్లయ్య (35) కార్మికుడు మృతి. ⇔ 2015 డిశెంబరు 10 విజయనగర్లోని ఎంసీ లేఅవుట్లో బైకుపై చెట్టు కూలి మంజునాథ్ (35) మృతి. ⇔ 2016 జూన్27 వివేక్నగర్లోని 7వ క్రాస్రోడ్లో చెట్టు కూలి జీవన్ (7) మృతి.ఇదే రోజు మల్లేశ్వరంలోని 18వ క్రాస్లో బైక్పై చెట్టు కూలి పాషా(50) మృతి.. ⇔ 2016 జులై 10 బసవనగుడిలోని కే.ఆర్.రోడ్లో ఆటోపై కొబ్బరి చెట్టు కూలి ఇంతియాజ్(45)మృతి. ⇔ 2017 సెప్టెంబర్ 8 జే.సీ.రోడ్లోని డిస్పన్సరీ రోడ్లోని కారుపై నీలగిరి చెట్టు కూలి భార్యభర్తలు భారతి, రమేశ్, బంధువు జగదీశ్ మృతి.