అమరనాథ్ యాత్రలో జిల్లా వాసి మృతి
గండేపల్లి : అమరనాథుని దర్శనానికి వెళ్లిన గండేపల్లి మండలం కె.గోపాలపురానికి చెందిన బొదిరెడ్డి నూకరాజు(62) గుండెపోటుతో సోమవారం మరణించాడు. భార్య నరసమ్మ, ఆయన శుక్రవారం బంధువులతో కలిసి అమరనాథ్ తీర్థయాత్రకు రాజమహేంద్రవరం నుంచి రైలులో బయలుదేరారు. శనివారం సాయంత్రం నిజామాబాద్ నుంచి జమ్ము వెళ్లేందుకు మరో రైలెక్కి, ఆదివారం ఉదయానికి కాట్ర అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ బస చేసి, సోమవారం మధ్యాహ్నం వైష్ణవదేవి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. 14 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోకుండానే మార్గం మధ్యలో నూకరాజు కుప్పకూలాడు. ఆలయానికి చెందిన వైద్య సిబ్బంది అంబులెన్సులో అక్కడకు చేరుకుని, ఆయనను పరీక్షించారు. అప్పటికే చనిపోయినట్టు చెప్పారని బంధువులు కొప్పాక వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు తెలిపారు. మృతదేహాన్ని అక్కడి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.
స్వగ్రామానికి మృతదేహం
ఆలయానికి చెందిన అంబులెన్సులో మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు తీసుకురానున్నారు. అక్కడి నుంచి స్వగ్రామానికి తరలిస్తారని బంధువులు తెలిపారు.